ఆరు పదుల భారతదేశ చరిత్రలో దేశ అత్యున్నత పీఠాన్ని ఒక మహిళ అధిరోహించడం 2007లో జరిగింది. ఆమె ప్రతిభా దేవీ సింగ్ పాటిల్. ఈమె దేశ అత్యున్నత పీఠాన్ని గత జులై 27వ తేదిన అధిరోహించారు. ఈ రోజు.. భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ రోజుగా మిగిలిపోయింది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓటమి ఎరుగని మహిళా నేతగా పేరుగడించిన ఈమె.. మహారాష్ట్రలోని జల్గావ్కు యాభై కిలోమీటర్ల దూరంలోని నద్గావ్లో డిసెంబర్ 19, 1934లో జన్మించారు.
ఆమె అసలు పేరు ప్రతిభా తాయి పాటిల్. మారుమూల పల్లె ప్రాంతంలో పుట్టినప్పటికీ, ఉన్నత విద్య నేర్చుకోవాలన్న ఆశయమే ఆమెను తారా స్థాయికి చేర్చింది. జల్గావ్లోని ఆర్.ఆర్.స్కూల్లో ప్రాధమిక విద్య పూర్తి చేసిన అనంతరం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను పూర్తి చేసి, ముంబైలోని గవర్నర్ లా కాలేజ్ నుంచి న్యాయవాద పట్టాను పొందారు.
చదువుకునే రోజుల్లో టేబుల్ టెన్నిస్ క్రీడలో మంచి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన ప్రతిభాపాటిల్.. 1962లో జరిగిన కళాశాల స్థాయి క్వీన్ పోటీల్లో విజేతగా నిలిచారు. 27 ఏళ్ళ వయస్సులో, అంటే 1962లో మహారాష్ట్రలోని ఎదలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలి విజయాన్ని రుచిచూశారు. అలా ప్రారంభమైన ఆమె రాజకీయ పయనం 2007లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల వరకు అప్రహతికంగా కొనసాగింది. తన రాజకీయ జీవితంలో ప్రతిభ వివిధ మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.
1978నాటి ఎమర్జెన్సీ కాలంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయి ముఖ్యనేతలందరూ దేవరాజ్ నాయకత్వంలో కాంగ్రెస్ యూ.ఆర్.ఎస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నా, ప్రతిభ మాత్రం పార్టీలోనే ఉండిపోయారు. 1978లో కాంగ్రెస్ యూఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు పాటిల్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
సంజయ్ గాంధీ చనిపోయిన సమయంలో ఇందిరాగాంధీకి మరింత దగ్గరై, ఆమెకు సపర్యలు చేశారు. ఇందిరా కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యమే ప్రతిభా పాటిల్ను దేశ అత్యున్నత పీఠంపై కూర్చొబెట్టేలా చేసింది. ఇలా దేశ ప్రథమ పౌరులారిగా కొనసాగుతున్న ప్రతిభా పాటిల్కు 1965 జులైలో మహారాష్ట్రకు చెందిన దేవీ సింఘ్ రాన్ సింఘ్ షెకావత్తో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.