సునీతా విలియమ్స్... ప్రపంచ మహిళా లోకం గర్వించదగ్గ నారీమణి. ప్రవాస భారతీయురాలిగా అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్న మహిళా వ్యోమగామి. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో నాలుగు దఫాలు స్పేస్ వాక్ నిర్వహించి సరికొత్త రికార్డును నెలకొల్పిన ఆస్ట్రోనెట్గా ఖ్యాతిగడించింది. అలా.. ఈయేటి మహిళా మణుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహిళ సునీతా విలియమ్స్.
అమెరికా దేశంలోని ఓహియోలోని యుక్లిడ్లో 1965, సెప్టెంబర్ 19న జన్మించారు. ప్రస్తుతం మస్సాచుసెట్స్లో స్థిరపడిన ఈమె.. మైకేల్ జే.విలియమ్స్ను వివాహమాడారు. అంతరిక్ష యాత్రలు చేయడమంటే ఎంత ఇష్టమో అలాగే.. పరుగుల పందెం, స్విమ్మింగ్, బైకింగ్, విండ్సర్ఫింగ్, స్నోబోర్డింగ్ మరియు బో హంటింగ్ అంటే కూడా ఎనలేని మక్కువ. 1983 సంవత్సరంలో మస్సాచుసెట్స, నేథమ్లో గల నేథమ్ హైస్కూల్లో విద్యను పూర్తి చేసిన సునీతా.. 1987లో యూఎస్.నావల్ ఎకాడమి నుంచి భౌతిక శాస్త్రంలో బి.ఎస్. పట్టాను అందుకున్నారు.
1995లో ఫోర్లిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో ఎమ్.ఎస్. పట్టాను స్వీకరించారు. ఆ తర్వాత అమెరికా ఎయిర్ఫోర్సులో ప్రవేశించిన సునీతా.. దాదాపు 30 రకాల ఎయిర్క్రాఫ్ట్లను 2770 గంటల పాటు నడిపిన అనుభవాన్ని తన సొంతం చేసుకుంది. ఇలా సాగుతున్న సునీతా విలియమ్స్ కెరీర్.. 1998 జూన్ మాసంలో ఉత్తర అమెరికా అంతరీక్ష పరిశోధన సంస్థ (నాసా)కు ఎంపికయ్యారు. అదే సంవత్సరం ఆగస్టు మాసంలో వ్యోమగామి శిక్షణకై ఆమె హాజరయ్యారు.
File
FILE
శిక్షణ అనంతరం రష్యా దేశపు సౌజన్యంతో రష్యా అంతరీక్ష పరిశోధన సంస్థతో కలిసి పని చేసిన సునీత, అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పనిచేసేందుకు ఎంపికైన వ్యోమగామిలో ఒకరిగా నిలిచారు. ఇటీవల నాసా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి పంపిన ఐఎస్ఎస్లో ఫ్లైట్ ఇంజినీర్గా సునీతా విలియమ్స్ సేవలందించారు. ఎక్స్పెడిషన్-14 సిబ్బందిలో నాలుగు స్పేస్వాక్లలో మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నిర్వహించిన మహిళా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
అలాగే అంతరిక్షంలో 195 రోజులు గడపడం ద్వారా షెన్నన్ ల్యూసిడ్ రికార్డును తిరగరాశారు. అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సునీతా విలియమ్స్, 2007 సంవత్సరం జూన్ 22న భూమికి సురక్షితంగా చేరుకున్నారు. భవిష్యత్లో అంగారక గ్రహంపై పాదంమోపాలన్నదే తన తదుపరి లక్ష్యమని సునీతా విలిమయ్స్ వినమ్రయంగా చెపుతోంది.
ప్రపంచ మహిళా జాతికే మణిమకుటంగా నిలిచిన సునీతా విలియమ్స్.. మాతృభూమిపై మమకారం మాత్రం తగ్గలేదు. అందుకే.. నింగి నుంచి భూమికి వచ్చాక తన పూర్వీకులు నివశిస్తున్న గుజరాత్ రాష్ట్రానికి వచ్చి వారి ప్రేమానురాగాలను పొందింది.