మీడియాకు సరికొత్త సవాళ్ళు

మంగళవారం, 25 డిశెంబరు 2007 (17:08 IST)
మీడియా పరిశ్రమ 2007 సంవత్సరంలో ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధిని చవిచూస్తున్న తరుణంలో, మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న రీతిలో ఉమా ఖురానా నకిలీ స్టింగ్ ఆపరేషన్ ఈ ఏటి వార్తలలో ప్రధానంగా చోటు చేసుకుని మీడియా పరిమితులను గుర్తు చేసింది.

అదేసమయంలో మిడ్‌డే పాత్రికేయులకు జైలు శిక్ష సైతం సామాన్య ప్రజల దృష్టిలో పడింది. ఈ నేపథ్యం మీడియా స్వేచ్ఛ మరియు విలువలపై దేశ వ్యాప్తంగా చర్చకు ఆస్కారమిచ్చింది.

పైన పేర్కొన్న రెండు అంశాలు మీడియాకు గల ఒక కోణాన్ని ఆవిష్కరించగా, ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్‌ల వివాహం సందర్భంగా మీడియా చేసిన హంగామా ప్రధాన వార్తలకు చోటు దొరకని పరిస్థితిని కల్పించింది.

ఈ సంవత్సరం కొత్తగా 35 టీవీ ఛానెళ్ళు తమ కార్యకలాపాలను ప్రారంభించగా, మొబైల్ టీవీ సాంకేతిక పరిజ్ఞానం భారతీయ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వివాదాస్పదమైన ప్రసార నియంత్రణ బిల్లు ఈ సంవత్సరంలోనే అటకెక్కింది. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న ప్రవర్తనా నియమావళి, ఛానెల్ యజమానుల వ్యతిరేకతకు గురయ్యింది.

FileFILE
మూడు మెట్రో నగరాలలో ప్రవేశపెట్టబడిన కాస్ (సీఏఎస్) విధానంతో కలుపుకుని మీడియా రంగం చవి చూసిన అభివృద్ధితో పాటు కొత్తగా వచ్చి చేరిన సవాళ్ళను 2007 ప్రతిబింబించింది.

అయితే, వాణిజ్య పోకడలను సంతరించుకోవడంలో జర్నలిజం చూపిస్తున్న అత్యుత్సాహం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై జరుగుతున్న దాడులు మరియు విలువలను పాటించే క్రమంలో మీడియాపై పెరుగుతున్న ఒత్తిడి, పాత్రికేయ సమాజాన్ని పునరాలోచనలో పడేస్తోంది.

ఈ సంవత్సరం మీడియా చూపిన సామాజిక క్రియాశీలతకు యావత్ భారతదేశం ప్రశంసల వర్షం కురిపించింది. జెస్సీకాలాల్ మరియు ప్రియదర్శిని మట్టో హత్య కేసులో బాధితులకు న్యాయం చేకూర్చడంలో మీడియా, న్యాయ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేసే తీరులో వ్యవహరించిందనే విమర్శలు సైతం ఇదే సమయంలో చోటు చేసుకున్నాయి.