'రంగస్థలం'లో జనసేన లక్ష్మీనారాయణ-పురంధేశ్వరి-దాడి

గురువారం, 28 మార్చి 2019 (15:59 IST)
ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కిపోయి వుంది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి గురించి ఇదివరకు ప్రజలకు చేరే అవకాశం వుండేది కాదు కానీ ఇప్పుడు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోగలుగుతున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే... ఎన్నికలు పురస్కరించుకుని  బిబిసి తెలుగు రంగస్థలం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వేదికపై ఆయా పార్టీలకు చెందిన నాయకులను ఆహ్వానిస్తూ సమకాలీన పరిస్థితులు ఎలా వున్నాయి, ఆయా పార్టీలు అధికారంలోకి వస్తే ఏమేమి చేయాలనుకుంటున్నాయి.. తదితర విషయాలను నాయకుల నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా మార్చి 27న విశాఖపట్టణంలో రంగస్థలం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వైసీపీ నాయకుడు దాడి వీరభద్రరావు, జనసేన నాయకులు, మాజీ సీబీఐ జేడి లక్ష్మీనారాయణ, భాజపా నాయకురాలు పురంధేశ్వరి పాల్గొన్నారు.
 
ముందుగా దాడి వీరభద్రరావు మాట్లాడుతూ... విశాఖపట్టణంలో పోరాడేవారు లేరు. ప్రజలు కూడా ఇలాంటి నాయకులను మన్నిస్తూ వస్తున్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వుంది. ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సి వుంది. హైదరాబాదు నుంచి ఫార్మా కంపెనీలు వెళ్లిపోవాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే... ఇపుడు ఆ కంపెనీలన్నీ వైజాగ్ బాట పట్టాయి. అవి ఇక్కడకు రాకుండా అడ్డుకునే నాయకులు ఎవరూ లేరు. ఆ కంపెనీలు ఇక్కడే స్థాపిస్తే ఇక కాలుష్యం ఎంతమేరకు పెరిగిపోతుందో ఊహించడమే కష్టం. వచ్చే ఎన్నికల్లో వైసీపి అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విద్యాసంస్థలను తీసుకువస్తాం అని చెప్పారు. 
 
జనసేన నాయకులు వి.వి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... భారతదేశంలో అధిక సంఖ్యలో యువత వుంది. వారిని అత్యంత శక్తివంతమైనవారిగా తీర్చిదిద్ది సరైనమార్గంలో పెట్టగలిగితే మన ఏదైనా సాధించగలుగుతాం.
 
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో నేను విజన్ 2025 దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనుకున్నాను. అంతేకాదు.. ఇదే లక్ష్యంతో ఓ పార్టీని కూడా స్థాపించాలనుకున్నాను. ఎవరైతే రైతులు, యువత, మహిళలు, విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై పోరాటం చేస్తారో వారితో కలిసి పనిచేయాలనుకున్నాను.
 
జనసేన పార్టీ మేనిఫెస్టో చూసినప్పుడు నేను చేయాలనుకున్న పోరాటానికి ఖచ్చితమైన వేదిక దొరికిందని భావించాను. పవన్ కల్యాణ్ గారి లక్ష్యాలు చూసినప్పుడు ఆయనతో కలిసి నడిస్తే ప్రజలకు అందాల్సినవన్నీ సాధించగలమనే నమ్మకం కుదిరి జనసేన పార్టీలో చేరాను అని వివరించారు.
 
అనంతరం భాజపా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ... నేను ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు చాలా సమస్యలను పరిష్కరించగలిగాను. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యింది. అపారమైన నీటి వనరులను ఉపయోగించడంలో ఘోరంగా విఫలమైంది. ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం నక్సల్ సమస్య కూడా ఒకటి. రైల్వే జోన్ రాకపోవడం వల్ల భారీ నష్టం జరిగిందని వాదించడంలో అర్థమే లేదు. ముఖ్యంగా ప్రశాంతమైన విశాఖ నగరం రోజురోజుకీ కాలుష్య కోరల్లోకి వెళ్లిపోవడం ఆందోళనకరమైన విషయం అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు