ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ - మే 13న పోలింగ్

వరుణ్

గురువారం, 18 ఏప్రియల్ 2024 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్‌సభ నాలుగో విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్‌సభ సీట్లకు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసింది. ఈ నాలుగో దశంలో ఏపీతో పాటు... ఒరిస్సా, అసెంబ్లీ, అరుణాచల్ ప్రదేశఅ, సిక్కిం అసెంబ్లీలతో పాటు 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగో విడతలో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. 
 
నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి.. 26వ తేదీన పరిశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్‌ పత్రాలు సమర్పించాలి. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
 
కాగా, గురువారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా జిల్లా కలెక్టరేట్లలో నామినేషన్లు దాఖలు చేయాలని సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనా సూచించారు. శాసనసభ నియోజకవర్గాల్లో బరిలో నిలిచేవారు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాలన్నారు. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా రెండు చోట్ల పోటీచేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థితోపాటు నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం వరకు అనుమతి ఉంటుందని చెప్పారు.
 
ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని పాటిస్తూ అభ్య‌ర్ధులు త‌మ నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయాల్సి ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నామినేషన్‌ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేష‌న్లను స్వీక‌రించే గ‌దిలో, అభ్య‌ర్ధులు ప్ర‌వేశించే ద్వారాల వ‌ద్దా సీసీ కెమేరాల‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడ‌ల్ కోడ్ అమ‌ల్లో భాగంగా అభ్య‌ర్ధుల ఊరేగింపుల‌ను, నామినేష‌న్ దాఖ‌లు చేసే కార్య‌క్ర‌మాల‌ను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారన్నారని ఈసీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
 
ఎన్నికల ప్రక్రియ షెడ్యూలు, ముఖ్య‌మైన తేదీలు
 
గెజిట్ నోటిఫికేషన్ జారీ : 18 ఏప్రిల్ 2024 (గురువారం)
నామినేషన్ల స్వీకరణ : 18 ఏప్రిల్​ - ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు
నామినేషన్లు వేయడానికి చివరి తేదీ : 25 ఏప్రిల్ 2024 (గురువారం)
నామినేషన్ల పరిశీలన తేదీ: 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2024 (సోమవారం)
పోలింగ్​ : 13 మే 2024 (సోమవారం)
కౌంటింగ్ : 04 జూన్ 2024 (మంగళవారం)
నామినేషన్లు దాఖ‌లు కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు
 
* అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురాలి.
* పార్ల‌మెంటుకు పోటీచేసే అభ్య‌ర్ధులు ఫార‌మ్ 2ఏ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫార‌మ్ 2బీలో దర‌ఖాస్తు చేయాలి.
* నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది.
* పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించబడదు.
* అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.
* నామినేష‌న్ల‌ను ఆర్ఓకు గానీ, సంబంధిత ఏఆర్ఓకు మాత్ర‌మే స‌మ‌ర్పించాలి.
* అభ్య‌ర్ది త‌న నామినేష‌న్‌ను నేరుగా గానీ, త‌న ప్ర‌పోజ‌ర్ ద్వారా గానీ స‌మ‌ర్పించ‌వ‌చ్చు.
* అభ్య‌ర్ధి నామినేష‌న్‌తో పాటు త‌మ పేరిట కొత్త‌గా తెరిచిన బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను స‌మ‌ర్పించాలి.
* 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు.
* నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయి.
* అభ్య‌ర్ధితో స‌హా ఐదుగురు వ్య‌క్తులు మాత్ర‌మే ఆర్ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చు.
* నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
* అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.
* సువిధ యాప్ ద్వారా నామినేష‌న్లను దాఖ‌లు చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ, వాటి కాపీల‌ను భౌతికంగా ఆర్ఓకు అంద‌జేయాల్సి ఉంటుంది.
* ఫార‌మ్‌-26 ద్వారా త‌న అఫ‌డ‌విట్‌ను స‌మ‌ర్పించాలి.
* ఫారమ్ 26 స్టాంప్ పేపర్ విలువ రూ. 10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
* భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకుంటే E స్టాంప్ కూడా ఉపయోగించవచ్చు.
* అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కిస్తారు.
* పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు