ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధం.. బరిలో ఉన్న ప్రముఖులు వీరే ..

ఠాగూర్

ఆదివారం, 12 మే 2024 (18:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభతో పాటు లోక్‌సభకు కూడా సోమవారం పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఎన్నికల సామాగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అలాగే, ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఎక్కడెక్కడి నుంచే రాష్ట్రానికి క్యూ కట్టారు. అయితే, వీరికోసం ప్రభుత్వం సరిపడ బస్సులు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసవస్థలు పడుతున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
 
మరోవైపు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 2.02 కోట్ల మంది పురుషులు కాగా.. 2.1 కోట్ల మంది మహిళలు, 3,421 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. అలాగే, 68,185 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 1.06లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 3, 500 మంది కర్ణాటక పోలీసులు, 4500 మంది తమిళనాడు పోలీసులు, 1,614 మంది ఎక్స్‌సర్వీస్‌మెన్‌, 246 మంది విశ్రాంత పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. 
 
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తంగా 3.31 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 35,356 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత కోసం 73 వేల మందికిపైగా పోలీసు బలగాలను మోహరించారు.
 
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ఏపీలో అసెంబ్లీ బరిలో తెదేపా అధినేత చంద్రబాబు (కుప్పం), వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ (పులివెందుల), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (పిఠాపురం), నారా లోకేశ్‌ (మంగళగిరి), బాలకృష్ణ (హిందూపురం), జైభారత్‌ పార్టీ చీఫ్‌ వీవీ లక్ష్మీనారాయణ (విశాఖ నార్త్‌), జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ (తెనాలి), సుజనా చౌదరి (విజయవాడ పశ్చిమ), నారాయణ (నెల్లూరు పట్టణం), రఘురామకృష్ణరాజు (ఉండి),  సత్తెనపల్లి (కన్నా లక్ష్మీనారాయణ) పోటీ చేస్తున్నారు. అలాగే, లోక్‌సభ బరిలో ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (కడప), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (రాజమహేంద్రవరం), మాజీ సీఎం ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి (రాజంపేట), భాజపా నేత సీఎం రమేశ్‌ (అనకాపల్లి), ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (విశాఖ) బరిలో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు