12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దశ వసంతాలు : డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

గురువారం, 11 మార్చి 2021 (10:26 IST)
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా దశ వసంతాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈనెల 12న ఘనంగా వేడుకలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ, వారి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో గడచిన పదేళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు
 
అధికారం చేపట్టిన ఇరవై నెలల అతి స్వల్ప కాలంలోనే పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 90 శాతాన్ని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా వైఎస్ జగన్ అమలు పరుస్తూ పార్టీ పట్ల ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతూ తమ పార్టీ నాయకులంతా గర్వంగా తలెత్తుకు తిరిగేలా తిరుగులేని పాలన అందిస్తున్నారని తెలిపారు.
 
జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారని అందుకు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఉదాహరణని చెప్పారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని అన్నారు. ఈ క్రమంలో వచ్చిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 
 
మార్చి 12వ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గ్రామగ్రామాన, పట్టణాల్లోని ప్రతి వార్డులోను, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించాలని, ఘనంగా వేడుకలు నిర్వహించాలని  డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ప్రకటనలో వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు