ఆరేళ్ల బాలికపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం...

గురువారం, 24 సెప్టెంబరు 2020 (18:20 IST)
కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూనే వున్నాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ ముగిసి అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనా.. ఇంకా కోవిడ్ ధాటిగా సాధారణ స్థితికి ప్రజలు చేరుకోలేదు. అయితే కామాంధులు మాత్రం మహిళలపై అకృత్యాలను ఆపట్లేదు. వయో బేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అభం శుభం తెలియని ఒక ఆరేళ్ల చిన్నారిపై ఈ ఘోరం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న పాపను.. భుజాలపై ఎక్కించుకుని తీసుకు వెళ్లిన వ్యక్తి బాలికపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇంటి బయట ఆడుకుంటున్న పాప కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిన్నారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చిన్నారి ఆడుకున్న కూడలిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు.
 
సీసీ కెమెరాల్లో చిన్నారి ఒక 50 ఏళ్ల వ్యక్తి తన భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతన్ని నల్లపాడుకు చెందిన స్వామిగా గుర్తించారు పోలీసులు. పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి చిన్నారి కనిపించగా ఆమెపై లైంగిక దాడి జరిగిందని గుర్తించిన పోలీసులు, వైద్య చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. 
 
నిందితుడు స్వామిని అరెస్ట్ చేసి, తమదైన శైలిలో విచారణ చేయగా నిందితుడు నేరాన్ని అంగీకరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు