కేటీఆర్‌కు అంత అహంకారం పనికిరాదు.. వైకాపాకు ముగ్గురు ఎంపీలే మిగులుతారు..

ఠాగూర్

గురువారం, 1 ఫిబ్రవరి 2024 (09:18 IST)
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు అంత అహంకారం పనికిరాదని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన కేటీఆర్‌ ఇతరుల గురించి మాట్లాడేటపుడు నోరు అదుపులో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు మదురై కోర్టులో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో మాణిక్యం ఠాగూర్ ఓ ట్వీట్ చేశారు. 'క్లోజ్డ్‌ కేసును దారి మళ్లించడానికి ప్రయత్నించవద్దు. మీరు నాపై మాత్రమే ఆరోపణలు చేశారు. వీడియోలో ఇతర పేర్లు లేవు. మదురై కోర్టు విచారణను ఎదుర్కోకుండా పారిపోలేవు. మీకు ఇంత అహంకారం పనికిరాదు. మీ పెయిడ్‌ సోషల్‌ మీడియా టీమ్‌ 'ఎక్స్‌'లో మాత్రమే దాడి చేయగలదు. ఒక అమాయకుడిని నిందించినందుకు కోర్టుకు రావాల్సిందే. నిజాయతీపరులకు ఇంకెప్పుడూ ఇలా జరగకూడదు' అని ట్వీట్‌ చేశారు. 
 
కాగా, మాజీ మంత్రి కేటీఆర్‌కు పరువు నష్టం నోటీసులు పంపానని, 7 రోజుల్లోగా స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపాకు వచ్చే ఎన్నికల తర్వాత కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగులుతారని ఆయన జోస్యం చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి