అమరావతికి ఒక్క పైసా ఇవ్వలేం : తేల్చి చెప్పి కేంద్ర ప్రభుత్వం

శనివారం, 4 జూన్ 2016 (09:28 IST)
అసలే నిధుల కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇకపై ఒక్క పైసా కూడా విడుదల చేయలేమని స్పష్టంచేసింది. ఇప్పటిదాకా కేటాయించిన రూ.2,050 కోట్లతోనే సరిపెట్టుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పినట్టు సమాచారం పైగా ఇదే అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల ముందు కేంద్రం వితండ వాదన చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ భేటీలో విభజన చట్టంలోని 94(3) సెక్షన్ ను బయటకు తీసిన కేంద్రం... సదరు సెక్షన్ ప్రకారం రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలను మాత్రమే తాము నిర్మించాల్సి ఉందని చెప్పింది. ఈ భవనాలన్నింటినీ రూ.2,050 కోట్లతోనే నిర్మించుకోవచ్చని వాదించింది. ఇది సాధ్యం కాదని ఏపీ భావిస్తే... ఆ నిధులను వెనక్కిస్తే తామే వాటిని నిర్మించి ఇస్తామని కూడా కేంద్రం చెప్పడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల నోట మాట రాలేదట.  

వెబ్దునియా పై చదవండి