చిత్తూరు జిల్లాలో 30 మంది ఎంపీడీవోల బదిలీకి నిమ్మగడ్డ ఆదేశం

గురువారం, 4 ఫిబ్రవరి 2021 (06:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. మొత్తం నాలుగు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో లేఖ రాశారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలపై లేఖలో ఆయన సరికొత్త ఆదేశాలను జారీ చేశారు. 
 
ఏకగ్రీవాలు జరిగిన ప్రాంతాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 30 మంది ఎంపీడీవోలను ట్రాన్స్ ఫర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నిమ్మగడ్డ పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నిర్ణయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఆయన పర్యటిస్తూ సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
 
మరోవైపు, పంచాయతీ ఎన్నికల కోసం ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ-వాచ్ యాప్‌ను తీసుకొచ్చింది. విజయవాడలోని కార్యాలయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈ యాప్‌ను ఆవిష్కరించారు.ఈ యాప్‌పై వైసీపీ మంత్రులు, నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
టీడీపీ కార్యాలయంలో ఈ యాప్‌ను తయారు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ యాప్‌ను కాకుండా సీఈసీ యాప్‌ను వాడాలని అంటున్నారు. ఈ యాప్‌పై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
 
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయడంలో ఆశ్చర్యం లేదని, పిటిషన్ వేయకపోతేనే ఆశ్చర్యపోవాలని అన్నారు. ఎలాంటి సందేహాలు, ప్రశ్నలకు తావు లేకుండా యాప్‌ను రూపొందించామని చెప్పారు. 
 
ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన తర్వాత, ఎలాంటి వివాదాలకు తావు లేదని అన్నారు. తాను తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని చేస్తానని చెప్పారు. నిజంగానే ఆయన తనపై ఎన్నో విమర్శలు వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ముందుకుసాగిపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు