అనితారాణి దుస్తులు మార్చుకుంటుంటే వీడియోలు తీసి వేధించారు: నారా లోకేష్

గురువారం, 1 ఏప్రియల్ 2021 (16:14 IST)
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి ఏ సీఎం అయినా సంతోషిస్తారు కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలపై దాడులు చేసి ఆనందిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని లక్కరాజుపల్లెలో వైసీపీ కార్యకర్తల దాడిలో మృతి చెందిన గరికపాటి కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించారు.
 
అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘బద్వేలులో సొంత పార్టీ ఎమ్మెల్యే చనిపోతే నవ్వుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అందుకే జగన్ రెడ్డి పేరు సైకో రెడ్డి. రాష్ట్రంలో సైకోరెడ్డి పాలన నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక గరికపాటి కృష్ణారావును దారుణంగా హత్య చేశారు. కృష్ణారావును ప్రాణాలను కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దళిత అభ్యర్థిని సర్పంచిగా గెలించామన్న కక్షతో మా పార్టీ నాయకుడిని  రోడ్డు పైన దారుణంగా హత్య చేశారు.
 
గతంలో అభివృద్ధి, సంక్షేమాల్లో ఇతర రాష్ట్రాలతో పోటీపడేవాళ్లం. కానీ నేడు దాడులు, హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలతో బీహార్‌తో పోటీపడుతున్నాం. వచ్చేది టీడీపీ ప్రభుత్వం అని అంబటి రాంబాబు గుర్తు పెట్టుకోవాలి. పోలీసులు లేకుండా వస్తే మా కార్యకర్తలు తరిమికొడాతరని హెచ్చరిస్తున్నా. 151 మందిమి గెలిచాం.. ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. దురాలోచనతో ఉన్న మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. మళ్లీ చెప్తున్నా.. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం. బడుగు, బలహీన వర్గాలు రాజకీయాల్లోకి రాకూడదా? దళిత మహిళ సర్పంచ్‌గా గెలిస్తే మీకెందుకంత కడుపుమంట.?
 
మా కార్యకర్తల జోలికొస్తే తోలుతీస్తాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 25 మంది కార్యకర్తలను దారుణంగా హత్య చేశారు. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మాస్కు ఇవ్వండని డాక్టర్ సుధాకర్ రెడ్డి అడిగితే ఇబ్బందులు పెట్టారు. అనితారాణి దుస్తులు మార్చుకుంటుంటే వీడియోలు తీసి వేధించారు. తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైంది. అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడాలి. కృష్ణారావు కుటుంబానికి అండగా వుంటా. హంతకులకు శిక్ష పడేవరకు అండగా వుంటాం.
 
ఆ కుటుంబానికి పార్టీ తరపున ఆర్థిక సాయం చేస్తే వాళ్లే తిరిగి వేరే కార్యకర్తలకు ఇవ్వాలన్నారు. కానీ కృష్ణారావు పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు మంచి చేయండని కుటుంబాన్ని కోరాక ఆర్థిక సాయాన్ని స్వీకరించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలి. కొంతమంది పోలీసుల అధికారులు చట్టాన్ని అతిక్రమించి పని మనుషుల్లాగా పనిచేస్తున్నారు. పోలీసులు మారి చట్టాన్ని కాపాడాలి. ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు ఇబ్బందులు  పడబోతున్నారు. మాచర్లకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పంపితే బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి చేశారు.
 
దాడిలో పాల్గొన్న వ్యక్తిని పోలీసులు కాపాడారు. మాచర్ల దాడి నిందితుడిని మున్సిపల్ చైర్మన్‌ను ఈ సైకోరెడ్డి చేశారు. అనూష అనే సోదరిని చంపితే ప్రభుత్వంలో స్పందన లేదు. టీడీపీ పోరాడితే అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చింది. 40 రోజులైనా ఆ కేసు ఏమైంది. ఎక్కడుంది మీ దిశ చట్టం.? హోంమంత్రి కూతురికి ఇలాంటి అన్యాయం జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా? ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వంపై తిరబడే రోజు వస్తుంది’’ అని హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు