సారా ఉద్యమానికి ఊపిరిపోసి... ఎన్టీఆర్ ప్రశంసలందుకున్న దూబగుంట రోశమ్మ ఇకలేరు!

ఆదివారం, 7 ఆగస్టు 2016 (12:36 IST)
ప్రముఖ సారా వ్యతిరేక ఉద్యమనేత దూబగుంట రోశమ్మ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుముశారు. రోశమ్మ స్వస్థలం నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దూబగుంట గ్రామం. కాగా అప్పట్లో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమానికి రోశమ్మ ఊపిరిపోసింది. ఆమె ఆధ్వర్యంలో నడిచిన ఉద్యమ ప్రభావం ప్రభుత్వాలే దిగివచ్చేలా చేసింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రశంసలను కూడా రోశమ్మ అందుకున్నారు.
 
1990 దశకంలో నెల్లూరు జిల్లా కలిగిరి మండల పరిధిలోని తూర్పు దూబగుంట గ్రామం నుంచి మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ఆమె ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆనాటి ఉద్యమం రోజురోజుకూ పెరిగి ఉవ్వెత్తున లేవగా, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ ప్రభావితమై, తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇచ్చిన హామీని అమలు చేశారు కూడా. 
 
రోశమ్మకు లభించిన గుర్తింపు ఆమె ఇంటిపేరును దూబగుంటగా మార్చేసింది. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, తన 93 ఏళ్ల వయసులో మరణించారు. కిడ్నీలు పాడైపోయిన దశలో డయాలసిస్ చేయించుకునే శక్తి లేక వైద్యానికి దూరమైన ఆమె, రెండు రోజులుగా ఆహారం తీసుకోక పోవడంతో కన్నుమూశారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి