తెలంగాణ, తమిళనాడు, కర్నాటక కంటే వెనుకబడ్డాం... ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి

శుక్రవారం, 12 జనవరి 2018 (21:09 IST)
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రికేయులకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని న్యూ ఢిల్లీ లోని ఆయన నివాసంలో శుక్రవారం కలసి మెమొరాండం సమర్పించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ భవన్, గురజాడ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రితో చర్చించిన సమావేశపు వివరాలను వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక లోటుతో విడిపోయినప్పటికి రాష్ట్రంలో వున్న మౌలిక వనరులను సద్వినియోగ పరచుకుంటూ అభివృద్ధి వైపు పయనిస్తున్నదని, అయినప్పటికీ ఆర్ధిక వనరుల నికర ఆదాయం, తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం సహకరించవలసిన ఆవశ్యకతను ప్రధానికి వివరించినట్లు చెప్పారు.
 
రాష్ట్ర విభజన జరిగి 3 ½ సంవత్సరాలు గడచినప్పటికీ కేంద్రం ఇచ్చే ప్రోత్సాహ సహాయం తక్కువగా వున్నదని, విభజనలో పొందుపరచిన అంశాలను పునః పరిశీలించి రాష్ట్రానికి తగిన రీతిన నిధులను సమకూర్చవలసినదిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని, పారిశ్రామికంగా అభివృద్ధి సాధించినప్పుడే సర్వీస్ సెక్టార్లో ఉద్యోగ, ఉపాధి  ఆవకాశాలు పెంపొంది అనుకున్న ఫలితాలను, ఆర్ధిక ప్రగతిని  సాధించగలమని ఇందుకు దక్షిణాది రాష్ట్రాల ఆదాయ వనరులు, మౌలిక వనరులను పోలుస్తూ సవివరంగా ప్రధానికి విశదీకరించినట్లు చెప్పారు.
 
ప్రస్తుత ధరల సూచిక ప్రకారం అభివృద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సూచికను విశదీకరిస్తూ సర్వీస్ సెక్టార్లో తెలంగాణ రాష్ట్రం 62.56 శాతం, తమిళనాడు 56.88 శాతం, కర్నాటక 64.64 శాతం, అఖిల భారత స్థాయిలో 53.66 శాతం అభివృద్ధిని సాధించగా పారిశ్రామికాభివృద్ధి లేనందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 46 శాతం మాత్రమే అభివృద్ధిని చేరుకోగలిగిందని వివరించారు. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 31.77 శాతం, 15.34 శాతం, తమిళనాడు 11.39 శాతం, కర్నాటక 11.68 శాతం, అఖిల భారత స్థాయిలో 17.32 శాతం అభివృద్ధి సాధించగా, పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 22.23 శాతం, తెలంగాణ 22.10 శాతం, తమిళనాడు 31.72 శాతం, కర్నాటక 23.68 శాతం, అఖిల భారత స్థాయిలో 29.02 శాతం అభివృద్ధి భాగస్వామ్యం వున్నదని పేర్కొన్నారు.
 
దేశీయ ఉత్పాదక రంగంలో 2011-12 ఆర్థిక సంవత్సరం అభివృద్ధి సూచిక ఆధారంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వాటా 50.69 శాతం, తెలంగాణ 49.31 శాతం వుండగా 2014-15 సంవత్సరంలో 51.01 శాతం, 48.99 శాతం, 2015-16 సవత్సరంలో 51.80 శాతం, 48.20 శాతం, 2016-17 సవత్సరంలో 51.97 శాతం, 48.01 శాతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు వరుస క్రమంలో వున్నాయని తెలిపారు.
 
దక్షిణాది రాష్ట్రాలలో జనాభా అభివృద్ధి, పారిశ్రామిక, ఇతర రంగాలలో ఆర్థిక అభివృద్ధి సాధనలో తలసరి ఆదాయం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 2013-14 సంవత్సరంలో 12.99 శాతం వుండగా, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ 10.96 శాతం, తెలంగాణ రాష్ట్రం 11.24 శాతం, తమిళనాడు 11 శాతం, కర్నాటక 17 శాతం, కేరళ 11.85 శాతం ఉండగా జాతీయస్థాయిలో 11.46 శాతం ఉందన్నారు. 2014-15 సవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో వనరుల వినియోగంతో వృద్ధి రేటులో గణనీయ ప్రగతిని సాధిస్తూ తలసరి ఆదాయాన్ని 13.07 శాతంతో గణనీయంగా పెంచుకోగలిగామని, ఈ వృద్ధి రేటు తెలంగాణలో 12 శాతం, తమిళనాడు 11.68 శాతం, కర్నాటక 11.64 శాతం, కేరళ 12.81 శాతం తలసరి ఆదాయ వృద్ధి రేటును సాధించగా, అఖిల భారత స్థాయిలో 9.31 శాతం ఉందన్నారు.
 
2015-16 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 15.44 శాతం, తెలంగాణ 9.63 శాతం, తమిళనాడు 5.87 శాతం, కర్ణాటకలో 7.55 శాతం, కేరళలో 5.74 శాతం వుండగా జాతీయ స్థాయిలో 8.80 శాతం ఉందన్నారు. 2016-17 సంవత్సరంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13.14 శాతం, తెలంగాణలో 12.80 శాతం, తమిళనాడులో 11.19 శాతం, కేరళలో 10.19 శాతం వుండగా జాతీయ స్థాయిలో 9.66 శాతం వృద్ధి రేటు ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సముచితంగా నిధులు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోడీకి సవివరంగా విశదీకరించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రికేయులకు వివరించారు.
 
గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన నిధులను సత్వరమే విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు.  2019 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నామని, జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 7780.07 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, దీనిలో 4329.06 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, మిగిలిన 3451.01 కోట్ల రూపాయలను సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబందించి సమగ్ర నివేదికను కూడా కేంద్ర జలవనరుల శాఖకు సమర్పించినట్లు వెల్లడించారు. 
 
అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధానిని 2500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేస్తున్నందున ఈ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం అందించాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు.  దీనిలో వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం మరింత అభివృద్ధి పరచేందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేయాలని, దీనివలన ప్రయాణికులకు ఎంతో వెసులుబాటుతో పాటు రాష్ట్ర ప్రగతిలో విశాఖ రైల్వే జోన్ కీలక భూమిక కాగలదని దీని ఆవశ్యకతను ప్రధానికి సవివరంగా వివరించినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు