గ్రామ వలంటీర్లకు జగన్ కానుక.. రూ.50 లక్షల బీమా సౌకర్యం

బుధవారం, 22 ఏప్రియల్ 2020 (09:18 IST)
కరోనా కట్టడికి తమవంతుగా కృషి చేస్తున్న గ్రామ వలంటీర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ముందువరుసలో నిలబడి గ్రామాల్లో, పట్టణాల్లో సేవలందిస్తున్న గ్రామ వలంటీర్లకు రూ.50 లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి పంచాయతీ రాజ్‌ శాఖకు ఓ సర్క్వులర్ జారీ అయింది.
 
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మందికి పైగా వలంటీర్లు ఉండగా, వీరందరికీ, పీఎంజీకే (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్) ప్యాకేజీ కింద బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్-19 ఇంటింటి సర్వేలో వలంటీర్లదే ప్రధాన పాత్రన్న సంగతి తెలిసిందే. 
 
కరోనా పాజిటివ్ వ్యక్తులతో వలంటీర్లు నేరుగా కాంటాక్ట్ అవుతుండటంతో, వైరస్ సోకే ప్రమాదం ఉన్నందునే, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమకు రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడంపై వలంటీర్లు హర్షం వ్యక్తంచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు