జగనన్న విద్యా దీవెనపై హైకోర్టు కీలక తీర్పు.. ఏంటది..?

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (20:31 IST)
కోవిడ్ కష్టకాలంలోనూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ మంత్రాన్ని వదలడం లేదు. ఇచ్చిన మాట ప్రకారమే.. ప్రకటించిన తేదీలకే పథకాలు అమలు చేస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల అమలులో మాత్రం వెనుతిరిగి చూడటం లేదు. 
 
ఇందులో భాగంగానే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివాలనే లక్ష్యంతో రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఈ ఏడాది జూలై 29 సీఎం జగన్ విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడతలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు రూ. 693 కోట్లు విడుదల అయ్యాయి. 
 
అంతేకాదు ఇక.. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ స్టూడెంట్స్‌కు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు అందిస్తున్న విషయం తెలిసిందే.
 
అయితే జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో డబ్బు జమపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లోనే జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్టును విన్నవించారు. 
 
కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిగింది. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ క్రమంలో, ఫీజులను నేరుగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.  విద్యా దీవెన మొత్తాన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. 
 
ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. దీంతో ఇకపై, జగనన్న విద్యా దీవెన డబ్బు.. విద్యార్థులు తల్లుల అకౌంట్లలో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ అప్పీల్‌కు వెళ్తుందా? లేక అమలు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు