ఆనందయ్య మందుల్లో పి - ఎల్ - ఎఫ్ మందులకు అనుమతి.. కంట్లో వేసే పసరు మందుకు...

సోమవారం, 31 మే 2021 (14:43 IST)
కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్య నిపుణుడు ఆనందయ్య మందుకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు పచ్చజెండా ఊపింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 
 
సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. అలాగే ‘కె’ అనే మందును కమిటీ ముందు చూపించకపోవడంతో దానికి కూడా అనుమతి నిరాకరించింది. 
 
ఇక ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హాని లేదని సీసీఆర్ఏఎస్ నివేదిక తేల్చడంతో ప్రభుత్వం వాటికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావడానికి మరో 2 - 3 వారాల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
 
ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం ఓ విజ్ఞప్తి చేసింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులను ఆపొద్దని కోరింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్ట ప్రకారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని తెలిపింది.
 
అయితే మందును తీసుకోవడానికి కొవిడ్ పాజిటివ్ రోగులు రాకుండా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రోగులకు బుదులు వారి కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి మందును తీసుకెళ్తే కొవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందని చెప్పిన ప్రభుత్వం.. మందు పంపిణీలో కొవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించాలని ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు