ఇంటికి వచ్చిన అర్జున్ రెడ్డి... నేడు ఉదయగిరిలో గౌతం రెడ్డి అంత్యక్రియలు

బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (08:24 IST)
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత అమెరికా నుంచి నెల్లూరులోని తమ ఇంటికి చేరుకున్నారు. అమెరికా నుంచి చెన్నైకు వచ్చిన అర్జున్ రెడ్డి చెన్నై నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరుకు చేరుకున్నారు. తన ఇంటిలోని మంత్రి ఛాంబర్‌లో ఉంచిన తన తండ్రి గౌతం రెడ్డి పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు.
 
తన తండ్రితో పాటు తనను ఒంటరిగా విడిచిపెట్టాలని అందరినీ అభ్యర్థించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మంత్రి గౌతమ్‌రెడ్డి తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల, మంత్రి దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొని భారతదేశానికి తిరిగి వచ్చారు.
 
కాగా, గౌతం రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. ఈ మరణంతో రాష్ట్రంతోపాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. గుండెపోటు రావడంతో మంత్రికి చికిత్స అందించేందుకు అపోలో ఆసుపత్రి నిపుణులు ఎంతగా ప్రయత్నించినా ఆయనను రక్షించలేకపోయారు.
 
ఇదిలావుంటే, గౌతం రెడ్డి పార్థివదేహాన్ని మంగళవారం నెల్లూరుకు తరలించారు. ఆయన స్వగృహంలో ఉంచిన భౌతికకాయానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మేకపాటి ఇంటికి పలువురు ఎంపీలు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలను బుధవారం ఉదయగిరిలోని మెరిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు