విశాఖకు రాజధాని ఎపుడో తరలి వెళ్లింది : వైకాపా మంత్రి కారుమూరి

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (08:43 IST)
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో విశాకపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటుచేయతలపెట్టింది. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే, కోర్టు ప్రతిబంధకాలూ ఉన్నాయి. వీటిని ఏమాత్రం పట్టించుకోని ఏపీ సర్కారు... రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు గుట్టుచప్పుడు కాకుండా లోలోపల ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విశాఖకు తరలింపు ఖాయమని, ఇందులో భాగంగానే కుటుంబంతో తాను నాలుగు నెలల క్రితమే విశాఖ వచ్చి, అద్దెకు ఇల్లు తీసుకుని ఉంటున్నానన్నారు. ఇకపై ఇక్కడే ఉంటానన్నారు. 
 
గురువారం సాయంత్రం విశాఖ గవర్నర్‌ బంగ్లాలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మూడు ప్రాంతాల్లో ఎక్కడికైనా సీఎం వెళ్లవచ్చన్నారు. తమ శాఖకు విశాఖలో అనువైన ప్రైవేటు భవనాలను పరిశీలిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబును అరెస్టు చేసిన బాధ ఉంటే సినీ హీరో బాలకృష్ణకు ఉంటే ఆయన తన సినిమా రిలీజ్‌ను ఎందుకు వాయిదా వేయలేదని ప్రశ్నించారు. 
 
హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ లాభాలు పెరిగాయని ఇటీవల ఆ సంస్థ ప్రకటించిందన్నారు. రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని టీడీపీ నేతలు పిలుపునిస్తారని.. కానీ బాలకృష్ణ, చంద్రబాబు కుటుంబసభ్యులు మాత్రం సంపాదన మానుకోరని మంత్రి ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా చంద్రబాబు ఉన్న సెల్‌లో ఏసీ సదుపాయం కల్పించారని గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు