కృత్రిమ వేలితో హైటెక్ హాజరు.. ఏపీలో ప్రభుత్వ వైద్యుడు సస్పెండ్

ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (11:39 IST)
కృత్రిమ వేలితో హైటెక్ హాజరు వేసిన ప్రభుత్వ వైద్యుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి రజనీ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగం అయినప్పటికీ ఆ వైద్యుడు తన ప్రైవేటు క్లినిక్‌లో నిత్యం బిజీగా గడుతున్నారు. పైగా, హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి తాను ప్రభుత్వ ఆస్పత్రిలోనే విధులు నిర్వహిస్తున్నట్టుగా చూపించేందుకు కృత్రిమ వేలితో హాజరు వేసి ఉన్నత వైద్యాధికారులను నమ్మిస్తూ వచ్చాడు. చివరకు అతని పాపం పడంటంతో చిక్కిపోయాడు. 
 
ఈ ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే  వైద్యాధికారిగా భాను ప్రకాష్ పని చేస్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం రాష్ట్ర ఆరోగ్య మంత్రి రజనీ సందర్శించారు. ఆ సమయంలో గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ డాక్టర్ అతి తెలివి వెలుగులోకి వచ్చింది. దీనిపై మంత్రి ఆదేశం మేరకు వైద్యాధికారులు ఆరా తీశారు.
 
భాను ప్రకాష్‌కు మార్టూరులో సొంత క్లినిక్ వుంది. నిత్యం అక్కడ బిజీగా ఉండే ఆయన తన కృత్రిమ వేలిని పీహెచ్‌సీ సిబ్బందికి ఇచ్చి క్రమం తప్పకుండా మూడు పూటలా హాజరు వేయించేవాడు. దీంతో ఇటు ప్రభుత్వ విధులు, అటు తన ప్రైవేటు క్లినిక్ వ్యవహారం సాఫీగా నడుపుతూ వచ్చారు. 
 
పైగా, ఆస్పత్రిలోనే సిబ్బందితో కలిసి మద్యం సేవిస్తూ, మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించేవాడని పలువురు సిబ్బంది కూడా మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ భాను ప్రకాష్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు