బీజేపీలో టీడీపీ నేతలు చేరడానికి కారణమేంటో తెలుసా?

శుక్రవారం, 21 జూన్ 2019 (13:04 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చర్య తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరడానికిగల కారణాలను ఏపీ బీసీ సంక్షేమ శాఖామంత్రి శంకర నారాయణ వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనుమతితోనే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారన్నారు. 
 
ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారనీ, అందులోభాగంగానే ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు టీడీపీలో చేరారని అన్నారు. పైగా, బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు పారిశ్రామికవేత్తలనీ, వీరందరిపై వివిధ కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసుల నుంచి విముక్తి పొందేందుకే వారు కాషాయం కండువా కప్పుకున్నారన్నారు. 
 
ఇకపోతే, నవ్యాంధ్రలో పసుపు పాలన అంతమైందన్నారు. ప్రస్తుతం రాజన్న రాజ్యం మొదలైందన్నారు. అలాగే, ప్రత్యేక హోదా అన్నది జగన్ నినాదమని, దాన్ని సాధించి తీరుతామని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు