మైనింగ్ శాఖలో సంస్కరణలకు ఆమోదం: మంత్రి పెద్దిరెడ్డి

శుక్రవారం, 21 మే 2021 (11:07 IST)
రాష్ట్రంలో మైనింగ్ శాఖలో పలు సంస్కరణలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆమోదం తెలిపారని రాష్ట్ర భూగర్భ గనులు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మైనింగ్ అధికారులతో సీఎం వైయస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ మైనింగ్ శాఖలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలను వివరించారు. భూగర్భ గనుల శాఖ ద్వారా పూర్తి పారదర్శకతతో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ఆ దిశలో పలు సంస్కరణలకు సీఎం ఆమోదముద్ర వేశారని వెల్లడించారు. ఇకపై రాష్ట్రంలో మైనర్ మినరల్స్‌ను ఈ-ఆక్షన్ ద్వారా వేలం నిర్వహిస్తామని తెలిపారు. గతంలో మాదిరిగా మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే విధానంను నిలిపివేస్తున్నామని, ఈ-ఆక్షన్ ద్వారానే వేలం ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

దీనివల్ల దాదాపు రూ.1000 కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఇది అమలులోకి వస్తుందని అన్నారు. అలాగే గ్రానైట్ మైనింగ్‌లో సీనరేజీ వసూళ్ళపై పలు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేశారని, రాజస్థాన్ లో అవుట్‌సోర్సింగ్ ద్వారా సీనరేజీ వసూళ్ళలో మంచి ఫలితాలు వస్తున్నాయని గుర్తించారని తెలిపారు.

దానిని మన రాష్ట్రంలోనూ అమలు చేయబోతున్నామని, దీనివల్ల రూ.1000 కోట్ల వరకు సీనరేజీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. ఇకపై గ్రానైట్ మైనింగ్‌ లో సైజ్‌ (వాల్యూమెట్రిక్ బేసిస్)తో సంబంధం లేకుండా బరువు ఆధారంగా సీనరేజీని నిర్ణయిస్తామని తెలిపారు. దీనివల్ల కనీసం 35 నుంచి 40 శాతం సీనరేజీ ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.

ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ విధానం అమలులోకి రాబోతుందని అన్నారు. మైనింగ్‌ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలన్న సీఎం ఆదేశాల మేరకు విజిలెన్స్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు