క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నం.. అబ్బాయి మృతి.. అమ్మాయి..?

సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:19 IST)
క్షణికావేశం కొంపముంచింది.. అవును.. క్షణికావేశంలో ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వాళ్లిద్దరూ మైనర్లు. తమ మధ్య ఏర్పడిన ఆకర్షణను ప్రేమగా భావించారు. అయితే ఇంతలో ఏమైందో ఏమోకానీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అబ్బాయి మరణించాడు. అమ్మాయి మృత్యువుతో పోరాడుతోంది.
 
ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాపూజీ నగర్‌లో నివాసం ఉండే పదో తరగతి చదువుతున్న బాలికకు, కేటీపీఎస్ కాలనీలో డిప్లొమా చదువుతున్న పోశం మణికంఠతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రేమలో వున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆదివారం సాయంత్రం, నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపైకి ఎక్కిన వీరు, పైనుంచి కిందకు దూకారు.
 
అదే సమయంలో అటుగా వెళుతున్న స్థానికులు, 108కు సమాచారం ఇవ్వగా, వారిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మణికంఠ మృతి చెందాడు. బాలిక కాళ్లు, చేతులు విరిగి, ముఖానికి తీవ్ర గాయాలైన స్థితిలో ఉండగా, మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. 
 
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని.. మృత్యువుతో ఆమె పోరాడుతుందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు