హిందూ దేవుళ్ళతో పెట్టుకున్నారు.. పుట్టగతులుండవ్... : మాధవీలత

బుధవారం, 6 జనవరి 2021 (15:58 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి బీజేపీ మహిళా నేత మాధవీలత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ దేవుళ్ళతో పెట్టుకున్నవారికి, మహిళలో జోలికి వచ్చినవారికి పుట్టగతులుండవ్ అంటూ జోస్యం చెప్పారు. 
 
ఈ మధ్య కాలంలో ఏపీలోని ఆలయాల్లో ఉన్న విగ్రహమూర్తులపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ దాడులపై రాష్ట్ర అట్టుడుకిపోతోంది. వీటిపై బీజేపీ మహిళా నేత మాధవీలత మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి విగ్రహాల ధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. 
 
ఏడాదిన్నరగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే.. నిందితులను పట్టుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 122 చోట్ల ఆలయాల్లో దాడులు జరిగాయని, కేవలం హిందూ దేవాలయాలపైనే దాడులు జరగడం ఏంటని ప్రశ్నించారు. 
 
హిందూ దేవుళ్లపైనే దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మతిస్థిమితం లేని వారి పని అంటూ సాక్షాత్తు సీఎం జగన్ వ్యాఖ్యానించారని, వారికి ఇతర మతాలు కనపడటం లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరగడమనేది..  కరోనాలా ఇదేమైనా కొత్త జబ్బా.. అని ఎద్దేవా చేశారు. 
 
తనపై సోషల్ మీడియాలో కారు కూతలు కూస్తున్న నోళ్లన్నీ హిందువులవేనన్న ఆమె.. హిందూ ధర్మం లేకుండా చేద్దామని అరాచకశక్తులు అనుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హిందువునని, తన ఆలోచనలు సాంస్కృతికంగా ఉంటాయన్నారు. తాను ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి.. తన వస్త్రధారణ సంప్రదాయంగా ఉండదని చెప్పుకొచ్చారు.
 
నుదుటన అంత పెద్ద బొట్టు పెట్టుకొంటేనే హిందువు కాదన్నారు. తాను హార్డ్ కోర్ హిందూనని అనుకుంటే, తాను హిందువునేనన్నారు. దీనర్థం ఇతర మతస్తులను ద్వేషించమని కాదన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడొద్దని, దేవాలయాలపై దాడులు ఆపాలన్నారు. మహిళలు, ఆలయాల జోలికెళితే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు