జగన్ వైరస్‌తో బాధ: రాజధాని రైతులు.. 79వ రోజుకు ఆందోళన

గురువారం, 5 మార్చి 2020 (07:53 IST)
అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 79వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది. రాజధాని అమరావతి కోసం రైతులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

మందడంలో రైతులు మాస్క్‌లు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ.. ప్రపంచమంతా కరోనాతో బాధపడుతుంటే..తాము జగన్‌ వైరస్‌తో బాధపడుతున్నామని విమర్శించారు.

జగన్ తన స్వార్ధం కోసమే మూడు రాజధానులు అంటున్నారని వారు మండిపడ్డారు. విశాఖలో భూములు ఇచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారన్నారు.

సీఆర్డీఏ చట్టం ప్రకారం చేసుకున్న ఒప్పందాలను..చెల్లవని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తమ‌ శిబిరాలకు మంత్రులు వచ్చి ఎందుకు చర్చించడం లేదని రైతులు నిలదీశారు. 
 
రాజధాని పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న మహిళలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, వైసీపీ నేతలు భౌతికదాడులకు పాల్పడుతున్నారని అమరావతి పరిరక్షణ సమితి(జేఏసీ) మహిళా ప్రతినిధులు గవర్నర్‌ విశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు కోసం ఉద్యమంలో పాల్గొంటున్న మహిళలకు రక్షణ కల్పించాలని విన్నవించారు.

ఈ మేరకు జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల మహిళా నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు