చంద్రబాబుకు మద్దతుగా 'సంఘీభావ యాత్ర' : ఐటీ ఉద్యోగుల ర్యాలీ

ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (08:32 IST)
టీడీపీ అధినేత నారా చంత్రబాబు నాయుడిక మద్దతుగా ఐటీ ఉద్యోగులు సంఘీభావ యాత్రను చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో వివిధ ప్రాంతాలకు చెందిన టెక్కీలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే, ఈ యాత్రను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పైగా, రాజమండ్రికి వచ్చే ఐటీ ఉద్యోగులను ఉడ్డుకుంటున్నారు. 
 
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసారు. దీనికి నిరసనగా ఐటీ ఉద్యోగులు కదం తొక్కుతున్నారు. టీడీపీ అధినేతకు మద్దతుగా వారు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్లలో ర్యాలీగా బయలుదేరారు. "కారులో సంఘీభావ యాత్ర" పేరుతో చేపట్టిన ఈ ర్యాలీలో నగరంలోని గచ్చిబౌలి, ఎస్సార్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులు పాల్గొంటున్నారు. రాజమహేంద్రవరానికి చేరుకున్నాక వారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలుపుతారు.
 
అయితే, ఐటీ ఉద్యోగుల ర్యాలీకి ఏపీలో అనుమతి లేదని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. ఈ మేరకు విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు.. తెలంగాణ - ఏపీ సరిహద్దులో గరికపాడు సహా వివిధ ప్రాంతాల్లో పలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు వెళ్లే కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు