బాధాతప్త హృదయంతో ఈ దురదృష్టకర వార్తను చెబుతున్నా....

గురువారం, 9 డిశెంబరు 2021 (14:21 IST)
భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీహెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్ ఉభయసభల్లో నేడు ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు వెల్లడించారు.
 
రాజ్ నాథ్ సింగ్ గ‌ద్గ‌ధ స్వరంతో పార్లమెంట్ లో మాట్లాడుతూ, ‘‘బాధాతప్త హృదయంతో ఈ దురదృష్టకర వార్తను చెబుతున్నా. భారత తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న మిలిటరీ హెలికాప్టర్‌ డిసెంబరు 8న తమిళనాడులో కుప్పకూలింది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ స్టాఫ్‌ కాలేజ్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నిన్న ఉదయం 11.48 గంటలకు సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్‌లో రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లింగ్టన్‌ బయల్దేరారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వీరు ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా, 12.08 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌ రాడార్‌ నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సంకేతాలు నిలిచిపోయాయి. 
 
 
కున్నూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలను గుర్తించిన స్థానికులు అక్కడకు వెళ్లారు. అప్పటికే హెలికాప్టర్‌ మంటల్లో ఉంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రావత్‌, హెలికాప్టర్‌ ప్రయాణికులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాదంలో రావత్‌, ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం చెందడం బాధాకరం’’ అని రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. అనంతరం రావత్‌ మృతికి సంతాపంగా ఉభయ సభల సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. దేశ సేవ‌లో వారి జ‌న్మ‌లు త‌రించాయ‌ని కొనియాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు