అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం

గురువారం, 25 జూన్ 2020 (13:18 IST)
తమ పార్టీ నేత అచ్చెన్నాయుడు ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. 
 
"అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందీ ప్రభుత్వం. అసలు అరెస్టు చేసే ముందురోజే ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆ విషయం చెప్పినా వినకుండా అమానుషంగా వందల కిలోమీటర్లు రోడ్లపై వాహనంలో తిప్పారు. దాంతో గాయం తిరగబెట్టి రెండోసారి ఆపరేషన్ చేయాల్సివచ్చింది. అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు చెప్పింది. నిలబెట్టవద్దు, కూర్చోపెట్టవద్దని కూడా సూచించింది.

10 రోజులు బెడ్‍ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏంటి? ఏసీబీ అధికారులు అర్ధరాత్రే అదుపులోకి తీసుకోవాలని చూడటం ఏంటి? అసలీ అర్థరాత్రి కుట్రలేంటి? కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇది కేసు విచారణలా లేదు, బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయి. 

ఈ కేసులో చూపే అత్యుత్సాహం, వైసిపి ల్యాండ్ మాఫియాపై, 108 అంబులెన్స్ స్కామ్ మీద, ఆవభూముల స్కామ్ పై, ఇసుక మాఫియాపై ఎందుకులేదు? కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు కోర్టుల ముందు నిలబడాల్సి వస్తోందని నిన్ననే కోర్టులు ఆక్షేపించాయి.

అధికారం చేతిలో ఉందికదా అని బీసీ నేత అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదు. న్యాయపరంగా మేమూ పోరాడతాం. మీ కుట్రలను అడ్డుకుంటాం" అని నిప్పులు చెరిగారు.
 
అర్థరాత్రి హైడ్రామా వెనుక కుట్ర కోణమేమిటి..?: ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల అక్రమాలలో అచ్చెన్నాయుడి పాత్ర లేకపోయినా అక్రమ అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు చికిత్స పొందుతున్న వ్యక్తి పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తిని రోడ్డు మార్గంలో 600 కిలోమీటర్ల దూరం తిప్పి.. మరోసారి శస్త్ర చికిత్సకు కారకులయ్యారు.

ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సిఫార్సు చేసినా, అవసరమైన మేర రక్షణ కల్పించాలని హైకోర్టు సూచించినా.. లెక్క చేయకుండా అర్ధరాత్రి వేళ బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రభుత్వ వైద్యుడి సమక్షంలోనే ఏసీబీ అధికారులు ఆయన వద్ద వివరాలు సేకరించాలని, విచారణ సమయంలో అచ్చెన్నాయుడు మంచం మీదే ఉండి సమాధానాలివ్వచ్చని.. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పింది.

విచారణ కూడా బెడ్ పై ఉన్న పొజిషన్ లోనే కొనసాగించాలని కోర్టు సూచిస్తే.. రాత్రికి రాత్రి డిశ్చార్జి చేసి అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించడం ఏ రాజ్యాంగంలో ఉంది. అచ్చెన్నాయుడుని డాక్టర్లు డిశ్చార్జి చేస్తున్నట్లు ప్రకటించిన క్షణాల్లోనే.. ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించడం వెనుక కుట్ర కోణం లేదంటారా.?

పోలీసులు, ఏసీబీ అధికారులు, వైసీపీ నేతల ఒత్తిళ్ల కారణంగానే డిశ్చార్జికి అనుమతిచ్చామని జీజీహెచ్ వైద్యులు చెబుతుండడం ప్రభుత్వ కుట్రలకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా అని అనుమానం కలుగుతోంది. కోర్టు తీర్పులను పట్టించుకోరు, రూల్ ఆఫ్ లాని పాటించరు. కోర్టులు ఇచ్చే బెయిల్ పై ఆధారపడిన ముఖ్యమంత్రి.. కోర్టు తీర్పుల్ని కూడా పట్టించుకోకుండా ఒక మాజీ మంత్రి విషయంలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం కుట్ర కాదా.?

అసలు అచ్చెన్నాయుడు గారిని ఏం చేద్దామని ప్రభుత్వం, ఏసీబీ, పోలీసులు భావిస్తున్నారు.? ఇన్నాళ్లూ.. ప్రతిపక్ష నాయకులను కేసుల పేరుతో వేధించారు, బెదిరించారు, అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. ఇప్పుడు ఏకంగా హతమార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి కుట్ర రాజకీయాలను, కక్ష పూరిత విధానాలను మానుకోవాలి. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.

హిట్లర్, గడాఫీల్లాంటి నియంతలే ప్రజావ్యతిరేక నిర్ణయాల కారణంగా అంతమైపోయిన విషయాన్ని ఈ ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తాము నియంతృత్వంగా ముందుకు వెళ్తామంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం చూస్తూ ఊరుకోవని, వాటి పని అవి చేసుకుంటూ పోతాయని తెలుసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు