ప్రత్యేక హోదాపై నా దారి సరైనదే : నాపై బురద చల్లితే రాదు : చంద్రబాబు

మంగళవారం, 18 జూన్ 2019 (16:03 IST)
ప్రత్యేక హోదాపై తాను అనుసరించిన వైఖరి సరైనదేనని, ఇపుడు నాపై బురద చల్లినంతమాత్రాన ప్రత్యేక హోదా రాదని టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 
 
ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక హోదాపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఓవైపు సీఎం జగన్, మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం వాగ్భాణాలు సంధించుకున్నారు. దానికితోడు, ఇతర నేతల వ్యాఖ్యలు కూడా సభలో ఉద్రిక్తభరిత వాతావరణానికి దారితీశాయి. 
 
దీంతో తనపై ఆరోపణలు చేస్తున్న విపక్ష సభ్యులపై చంద్రబాబు ధీటుగా స్పందించారు. ప్లానింగ్ కమిషన్ వెళ్లిపోయేవరకు ప్రత్యేకహోదాపై చంద్రబాబు స్పందించలేదని, ప్లానింగ్ కమిషన్‌కు చంద్రబాబు ఒక్క లేఖ కూడా రాయలేదని జగన్ ఆరోపించగా, ఆ వ్యాఖ్యలు వాస్తవం కాదని చంద్రబాబు బదులిచ్చారు. ప్లానింగ్ కమిషన్ వద్దకు తాను వెళ్లి ప్రయత్నం చేయలేదన్న మాట తప్పుడు ఆరోపణ అని అన్నారు.
 
'ప్లానింగ్ కమిషన్ పేరుతో నాపై బురద జిల్లాలని ప్రయత్నిస్తున్నారు. నామీద బురద చల్లినంత మాత్రాన ప్రత్యేక హోదా రాదు. మీరు ప్రత్యేక హోదా సాధిస్తామని చెబుతున్నారు కదా, సాధించండి. జగన్ మోహన్ రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను ప్రజలు ఇచ్చారు కదా, వాళ్లతో ప్రత్యేక హోదా సాధించమనే చెబుతున్నట్టు చెప్పారు. 
 
ప్రత్యేకహోదా కోసం టీడీపీ ప్రయత్నాలను తప్పుబట్టడం సరికాదు. బీజేపీతో స్నేహపూర్వకంగా ఉంటూనే వారితో విభేదించాం. అప్పట్లో మేం శాలువాలు కప్పామని, మెమెంటోలు ఇచ్చామని అంటున్నారు, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి కూడా శాలువాలు, మెమెంటోలే ఇస్తున్నారు, వచ్చే ఐదేళ్లలో మీరు ఇచ్చేవాటితో బీరువాలు, రూములు కూడా నిండిపోతాయి'  అంటూ చంద్రబాబు ఓ సెటైర్ వేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు