చంద్రబాబు రిమాండ్ పొడగింపు - సెక్యూరిటీపై అనుమానాలు

గురువారం, 19 అక్టోబరు 2023 (13:49 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలు
లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జ్యూడీషియల్ రిమాండ్‌ను విజయవాడలోని ఏపీ సీఐడీ కోర్టు పొడగించింది. చంద్రబాబు రిమాండ్ గురువారంతో ముగియడంతో ఆయనను వర్చువల్‌గా న్యాయమూర్తి హిమబిందు ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆ తర్వాత రిమాండ్‌ను నవంబర్ ఒకటో తేదీ వరకు పొడగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలో జైలులో తన సెక్యూరిటీ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని న్యాయాధికారి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్ళారు.
 
దీంతో భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా లిఖితపూర్వకంగా అందించాలని కోర్టు ఆయనకు సూచన చేసింది. వాటిని వివరిస్తూ జైలు నుంచి లేఖ రాయాలని జడ్జి చెప్పారు. ఆ లేఖను తనకు అందజేయాలని జైలు అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో దాఖలైన పిటిషన్లపై నేపథ్యంలో జడ్జి స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులు ఆరా తీశారు. ఆయన వైద్య నివేదికలు కోర్టుకు అందజేయాలని ఆదేశించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 
 
20న క్వాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు... తర్వాత ఏం చేద్దామంటూ సీఎం జగన్ సమీక్ష  
 
తనపై అక్రమంగా నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసును కొట్టి వేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించనుంది. సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పును వెలువరిస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొనివుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ తీర్పు ఎలా ఉన్నప్పటికీ తదుపరి పరిణామాలపై చర్చించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో సమీక్ష నిర్వహించారు. గురువారం సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటనకు వెళ్తేన్న దృష్ట్యా ఈ అంశంపై ముందుగానే సమీక్ష చేపట్టారు. ఇందులో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సీఎం తన నివాసంలో సమావేశమయ్యారు.
 
సుప్రీంకోర్టులో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉందనే అంశంపై సుప్రీంకోర్టు న్యాయవాదులు తెలిపిన అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా.. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. తీర్పు ఎలా వచ్చినా అందుకు తగినట్టుగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీని సీఎం ఆదేశించారు. 
 
ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న పలు కీలక కేసుల పురోగతిపై డీజీపీ, ఏఏజీతో సీఎం ప్రత్యేకంగా చర్చించారు. స్కిల్ డెవలప్మెంట్, ఏపీ ఫైబర్ నెట్, రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల వ్యవహారంపై చర్చించారు. కేసుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై డీజీపీ, ఏఏజీకి సీఎం దిశానిర్దేశం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు