చంద్రబాబుకు రిమాండ్ పొడగింపు - నేడు బెయిల్ పిటిషన్‌పై విచారణ

సోమవారం, 25 సెప్టెంబరు 2023 (08:42 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జ్యూడిషియల్ రిమాండ్‌ను అక్టోబరు ఐదో తేదీ వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడగించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆయన రిమాండ్‌ ఆదివారంతో ముగియడంతో వర్చువల్ విధానంలో న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి వచ్చే నెల 14వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. అంటే, చంద్రబాబు రిమాండ్‌ను మరో 11 రోజుల పాటు పొడగించారు. 
 
మరోవైపు, సీఐడీ పోలీసులు మాత్రం మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరుతున్నారు. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెల్సిందే. ఈ కస్టడీ కూడా ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే, ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. చంద్రబాబును రెండురోజుల పాటు 12 గంటలకు పైగా విచారించిన సీఐడీ 120 ప్రశ్నలు సంధించింది. 
 
ఇదిలావుంటే, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ సోమవారం విచారణకు రానుంది. ఈ విషయాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తే స్వయంగా చంద్రబాబుకు తెలిపారు. విచారణ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారా? ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వైద్య పరీక్షలు నిర్వహించారని, తనను ఏవిధంగా ఇబ్బంది పెట్టలేదని చెప్పారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ... రేపు (సోమవారం) బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామన్నారు. విచారణ సందర్భంగా ఏం గుర్తించారో బయట పెట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు విజ్ఞప్తి చేయగా, న్యాయమూర్తి స్పందిస్తూ... వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను మీ న్యాయవాది నుంచి తీసుకోవాలని జడ్జి సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు