అనంతపురం నుంచి కంటివెలుగు.. ప్రారంభించిన సీఎం జగన్

గురువారం, 10 అక్టోబరు 2019 (13:39 IST)
రాష్ట్రంలో అంథత్వ నిర్మూలన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు, చికిత్స అందించే వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని గురువారం ప్రారభించారు. ఇంటింటా కంటివెలుగు నినాదంతో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో ప్రారంభించారు. 
 
ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నుంచి వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఉదయం 11.35 గంటలకు కార్యక్రమాన్ని ఆరంభించనున్నారు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మొదలుపెడతారు. 
 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా అనంతపురం జిల్లాలో పర్యటించారు. దీంతో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికారు. తొలి దశలో చిన్నారులకు కంటివెలుగు పథకం ద్వారా అంధత్వ సమస్యలను 80 శాతం తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఆరు దశల్లో అమలయ్యే కంటివెలుగులో తొలి 2 దశల్లో ప్రభుత్వ పాఠశాలల్లోని 70 లక్షల మంది విద్యార్థులపై దృష్టి పెడతారు. ఫలితంగా కంటి సమస్యలను చిన్న వయసులోనే నిర్మూలించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు కంటి పరీక్షల నిర్వహణపై శిక్షణనిచ్చారు. ఇందుకు సంబంధించిన విజన్ కిట్లు సైతం అన్ని పాఠశాలలకు చేర్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు