అటల్‌జీకి నివాళి.. చంద్రబాబు భావోద్వేగం.. జగన్ ఏమన్నారంటే?

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (12:31 IST)
మాజీ ప్రధాన మంత్రి దివంగత వాజ్‌పేయికి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. వాజ్‌పేయి‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని వాజ్ పేయి నివాసానికి వచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆపై మీడియాతో మాట్లాడారు.


వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే తాను సీఎంగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అటల్‌జీ తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైయ్యారు. 
 
1998లో తాను హైటెక్ సిటీ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తే అటల్‌జీ వచ్చారన్నారు. వాంబే (వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన) పథకానికి ఏపీ నుంచే అంకురార్పణ జరిగిందని బాబు గుర్తు చేసుకున్నారు. తాను అడగ్గానే ఎంఎంటీఎస్, శంషాబాద్ ఎయిర్ పోర్టులను మంజూరు చేశారని బాబు తెలిపారు.

స్పీకర్ పదవికి ఓ మంచి ఎంపీని సూచించాలని కోరితే, తాను బాలయోగిని సూచించానని, మరోమాట మాట్లాడకుండా, ఆయన అభ్యర్థిత్వాన్ని ఓకే చేశారని చెప్పారు. అటువంటి మహానేతను కోల్పోవడం దేశానికి తీరనిలోటని చంద్రబాబు తెలిపారు. 
 
మరోవైపు భారతదేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. మాజీ ప్రధాని, అటల్‌ బిహారీ వాజ్‌ పేయి మరణం పట్ల ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అటల్‌జీ మృతితో భారత రాజకీయాల్లో ఓ శకం ముగిసినట్టయిందని పేర్కొన్నారు. విభేదించే రాజకీయ పార్టీల వారికి కూడా ఆమోదయోగ్యుడిగా, అద్భుతమైన, ఆకట్టుకునే వక్తగా, కవిగా వాజ్ పేయి నిలిచారని జగన్ గుర్తు చేశారు. 
 
రాజకీయ విలువలూ, మర్యాదల పరంగా ఆయన శిఖర సమానుడని, విదేశీ దౌత్య దురంధరుడని, పార్లమెంటరీ సంప్రదాయాల పరంగా మహోన్నతుడని జగన్ కీర్తించారు. అందరి మన్ననలూ పొందిన వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు జగన్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు