కాపు పోరాటం నుంచి తప్పుకున్నానని ముద్రగడ చెప్పినా పట్టించుకోని సీఎం, ఎందుకని?

బుధవారం, 15 జులై 2020 (18:38 IST)
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభం చేసిన హడావిడి అంతాఇంతా కాదు. కాపులను బిసీల్లో చేర్చాలంటూ తెగ హడావిడి చేసేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాపులతో సమావేశాలను జరిపి కాక రేపారు. ఇదంతా ఒక ఎత్తయితే వైసిపి అధికారంలోకి వచ్చింది.
 
ఆ తరువాత ఇక ముద్రగడ సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అవడమంటే జగన్మోహన్ రెడ్డిని విమర్సించకుండా ఉండిపోవడమే. తాను కాపు పోరాటం నుంచి తప్పుకున్నట్లు ఏకంగా లేఖనే రాసేశారు. దీంతో ఒక్కసారిగా కాపులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ముద్రగడ ఇలాంటి నిర్ణయం తీసుకోవడమేంటో ఎవరికీ అర్థం కాలేదు.
 
అయితే ఇదంతా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడానికేనన్న వారు లేరు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అర్హులైన కాపు మహిళలకు నిధులు మంజూరు చేసి వారి అకౌంట్లలోనే వేశారు. ఇదిలావుంటే రిజర్వేషన్ల అంశంపై తాను ఇప్పుడు మాట్లాడితే పరిస్థితి తనకు అనుకూలంగా వుండదన్న నిర్ణయానికి ముద్రగడ వచ్చారట. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులు జరుగుతుండటం ముద్రగడను బాగా భయపెట్టిందట. దీంతో తెలిసి తెలిసి అధికార పార్టీ నేతలతో ఎందుకు గొడవపెట్టుకోవడం, సైలెంట్‌గా ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చేశారట.
 
అందుకే ఉన్నట్లుండి ముద్రగడ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలంటే ఏదో ఒకటి చేయాలని.. పూర్తిగా రిజర్వేషన్ల అంశం నుంచి పక్కకు తప్పుకుంటే ఉపయోగం ఉంటుందన్న నిర్ణయానికి వచ్చి అదే చేశారట. ఇప్పుడిదే చర్చకు దారితీస్తోంది. కాపు పోరాటం నుంచి తప్పుకున్నానని ప్రకటించినా సీఎం జగన్ ఆయనను పెద్దగా పట్టించుకోనట్లు కనబడుతోంది. దీంతో ఆలోచనలో పడిపోయారట ముద్రగడ. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు