పరిష్కరించలేకపోతే విశ్వసనీయత పోతుంది : కలెక్టర్లతో సీఎం జగన్

మంగళవారం, 16 జులై 2019 (13:58 IST)
స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించలేకపోతే మనపై ఉన్న విశ్వసనీయత పోతుందని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆయన స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 12వ తేదీ వరకు వచ్చిన వినతి పత్రాలు, వాటి పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. 
 
తొలి 12 రోజుల్లో మొత్తం 45,496 వినతులు రాగా, ఇందులో ఆర్థిక అంశాలకు సంబంధంలేని అంశాలపై 1904 వినతులు వచ్చాయన్నారు. ఇందులో ఏడురోజుల్లోగా పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా 1116 ఉన్నాయని గుర్తుచేశారు. ఒక స్పందనలో వచ్చిన గ్రీవెన్సెస్‌ని వచ్చే స్పందనలోగా తీర్చకపోతే... రానురాను ఇవి పేరుకుపోతాయన్నారు. వచ్చే స్పందనలోగా పరిష్కారం కావాల్సిన అంశాలు తప్పకుండా చేయాలన్నారు. మన దృష్టి, ఫోకస్‌ తగ్గతే విశ్వసనీయత దెబ్బతింటుందని తెలిపారు. 
 
ప్రజలను సంతోష పెట్టే విధంగా ఈ కార్యక్రమం ఉండాలన్నారు. ఇప్పటివరకూ బాగానే చేస్తున్నారు, మరింత బాగా చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. గ్రీవెన్సెస్‌ పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలన్నారు. 80శాతం గ్రీవెన్సెస్‌ భూ సంబంధిత, సివిల్‌సప్లై, పెన్షన్లు, పురపాలక, నగర పాలక సంస్థలకు చెందినవని, ఇళ్లకు సంబంధించినవి ఉన్నాయన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించిన విజ్ఞాపన పత్రాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. 
 
ఎమ్మార్వోలు తీసుకున్న గ్రెవెన్సెస్‌ని కలెక్టర్లు ఆన్‌లైన్లో చూసే పరిస్థితి ఉండాలని చెప్పారు. అదేసమయంలో జేసీ కూడా దీన్ని సమీక్షించే పరిస్థితి ఉండాలిని చెప్పారు. కలెక్టర్, జేసీ కూడా పక్కపక్కనే ఉంటారు కాబట్టి అక్కడికక్కడే నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల చాలావరకు సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. పై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎమ్మార్వోలు కూడా చురుగ్గా సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. 
 
జిల్లా స్థాయిలో వస్తున్న విజ్ఞాపన పత్రాల పరిష్కారంలో నాణ్యత ఉంటుందో లేదో కలెక్టర్లు పరిశీలించాలి సూచించారు. వారంలో ఒకరోజు కలెక్టర్‌ ఎమ్మార్వోలతో, స్థానిక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సలహా ఇచ్చారు. దీనివల్ల సిబ్బంది స్పందన కార్యర్రమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంటారన్నారు. పై నుంచి కింది స్థాయివరకూ గట్టి సంకేతాన్ని పంపించినట్టు అవుతుందన్నారు.

ప్రతి సోమవారం ఎమ్మార్వో కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ఎలా జరుగుతుందో నేరుగా కెమెరాల ద్వారా చూడాలని కోరారు. ఇక్కడ నుంచి కూడా సీఎస్‌ పర్యవేక్షిస్తారని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఫిర్యాదుల పరిష్కారంపై కాస్త ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని కోరారు. అవినీతి అన్నది ఉండకూడదని పదేపదే చెప్పాను, ఎమ్మార్వో కార్యాలయాల్లోకాని, పోలీస్‌స్టేషన్లలో కాని ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదని నేను అనుకోవచ్చా? అవినీతి నిర్మూలనపై మనం ఇచ్చిన సందేశం బలంగా పోయిందా? లేదా అంటూ కలెక్టర్లను అడిగిన సీఎం ఎక్కడా కూడా అవినీతిని సహించబోమని స్పష్టంచేయాలని చెప్పారు. 
 
ఈ విషయంపై కలెక్టర్లు, ఎస్పీలు గట్టి సందేశాన్ని ఇవ్వాలని కోరారు. కూకటి వేళ్లతో అవినీతిని పెకలించివేయాలన్నారు. నా స్థాయిలో నేను గట్టిగా ప్రయత్నిస్తున్నా, మీ స్థాయిలో మీరు చేయాలని, దయచేసి మీరు అంతా అవినీతి నిర్మూలనపై దృష్టిపెట్టాలని కోరారు. లంచం లేకుండా నేను పనిచేసుకోగలిగాను అని ప్రజలు అనుకోవాలి అని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌కు, ఎమ్మార్వో కార్యాలయాలకు ఎవరు వచ్చినా సంతోషంగా వెళ్లామనే భావన ఉండాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు