ఒకవైపు ఎమ్మెల్యేగా గెలిచి నేరుగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ విధంగా కేబినెట్లో మంత్రిపదవి స్వీకరించడానికి బదులుగా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా వచ్చి కేబినెట్ సీటు కోసం ప్రయత్నిస్తున్న నారా లోకేశ్పై నెటిజన్లు, ప్రజలు సెటైర్లు వేస్తూ ఆడుకుంటూండగా మరోవైపు క్రైస్తవ మతప్రచారకుడు డాక్టర్ కేఏ పాల్ ఇంకా పెద్ద సెటైర్ వేసేశారు. బోడి ఎమ్మెల్సీ పదవి నీకెందుకు నేనున్నాగా. ఎమ్మెల్యే సీటుకే పోటీ చేస్తే అవలీలగా నిన్ను గెలిపిస్తా అంటూ పాల్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో ఇంకా దుమారం లేపుతోంది.
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్కు సోమవారం ఆయన హితబోద చేశారు. లోకేశ్ ఎమ్మెల్సీగా రావొద్దని, ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని సూచించారు. అవసరమైతే తానే స్వయంగా లోకేశ్ను గెలిపించేందుకు ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుంటానని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోసం ప్రచారం చేసి గెలిపించినట్లుగానే లోకేశ్కు ప్రచారం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంలో లోకేశ్ ఏమాత్రం వెనకడుగు వేయోద్దంటూ ట్వీట్ ద్వారా చురకలంటించారు.
ఇప్పటికే నారా లోకేశ్ ఎమ్మెల్సీ పదవిని చేపట్టడం ద్వారా ఏపీ మంత్రి వర్గంలోకి అడుగుపెట్టబోతుండటంపై పలు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తూ పరోక్షంగా విమర్శలు చేస్తున్నాయి. దమ్ముంటే లోకేశ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టాలే తప్ప ఇలా దొడ్డిదారిలో ఎమ్మెల్సీ ముసుగు రావడమేమిటంటూ పెదవి విరుస్తున్నారు.