తీవ్ర సంక్షోభంలో భారత్ : విత్తమంత్రి నిర్మలమ్మ భర్త పరకాల ఆందోళన

ఆదివారం, 2 జులై 2023 (13:16 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకునివుందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం నిరుద్యోగం, ధరల పెరుగుదల అధికంగా ఉండటం ఇపుడేనని చెప్పారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా(మెఫీ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన సదస్సుకు హాజరైన ఆయన 'సంక్షోభంలో మన గణతంత్రం - విశ్లేషణ' అంశంపై ప్రసంగించారు.
 
అటు కేంద్రంలోనూ, ఇటు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ముస్లిం మంత్రి, ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేరని గుర్తుచేశారు. స్వాతంత్ర్య ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేనివాళ్లు దేశభక్తులుగా చెలామణి అవుతున్నారన్నారు. దేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు ఎంతమంది, వలస కార్మికులు ఎంతమంది చనిపోయారు అనే వివరాలు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఉన్నాయా అని నిలదీశారు. 
 
దేశంలో 25శాతం జనాభా పౌష్టికాహారం లేక బలహీనమైపోతున్నారన్నారు. భారత్‌లో చైనా చొరబడినా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా, నిరుద్యోగం పెరిగినా పట్టించుకోవడం లేదని మతం ముసుగులో కొట్టుమిట్టాడుతున్నామన్నారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా భావజాలం పెరుగుతుందన్నారు. భారత్‌ను మరో పాకిస్థాన్ చేయాలనుకుంటే గాధీ, నెహ్రూ, పటేల్‌లకు రెండు నిమిషాలు పట్టేది కాదన్నారు. కాగా, సాక్షాత్ దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్తే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇపుడు ప్రధాని నరేంద్రమోడీ సర్కారుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు