ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

గురువారం, 17 నవంబరు 2022 (08:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్‌కు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. గత 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె నిబంధనలు ఉల్లంఘించారంటూ బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ జారీ చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27వ తేదీన ఉషశ్రీ చరణ్‌పై అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. 
 
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఆమె ర్యాలీ నిర్వహించారంటూ అప్పటి తాహసీల్దారు డీసీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీంతో సెక్షన్ 188 కింద ఉషశ్రీతో పాటు మరో ఏడుగిరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు నిందితులు పదేపదే హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు