సీఎం జగన్‌కు భవిష్యత్‌‌ అర్థంకాక ఎగిరెగిరి పడుతున్నారు : సీపీఐ నారాయణ జోస్యం

బుధవారం, 4 అక్టోబరు 2023 (17:29 IST)
ఎన్నో అవినీతి అక్రమ కేసులు ఉన్న ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్‌లో మరిన్ని కష్టాలు తప్పవని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ జోస్యం చెప్పారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారన్నారు. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్డీయేలో కలుస్తారన్న విషయాన్ని మోడీ ఇప్పుడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని ఇంత దిగజారి మాట్లాడతారనుకోలేదన్నారు. మోడీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మోడీ ఎలా నమ్మలేదో.. కేసీఆర్‌ను కూడా అలానే అనుమానించాల్సి ఉంటుందన్నారు. పసుపు బోర్డు ప్రకటన చనిపోయే ముందు తులసి తీర్ధం పోసినట్లు ఉందన్నారు. 
 
'మోడీ చెప్పాల్సిన అసలు రహస్యం ఏపీలో విలువైన ఇసుక బీచ్‌లు అదానీకి అప్పగించిన విషయం. లిక్కర్ స్కాంలో ఉన్న భారాస, వైకాపా.. భాజపాతో కలిసిపోయాయి. మిగతా వాళ్లను జైల్లో ఉంచుతున్నారు. రూ.వేల కోట్ల తిన్న వాళ్లు బయట ఉన్నారు. రూ.వందల కోట్ల అవినీతి పేరుతో చంద్రబాబును జైల్లో పెట్టారు. ఆయన్ను అక్రమ పద్ధతిలో అరెస్టు చేశారు.. అది సరికాదు. ఆయనేం దేశం వదిలి పారిపోయే వ్యక్తి కాదు. కేంద్రంలో మోడీ, ఏపీలో జగన్ ప్రతిపక్ష నేతలను మానసికంగా ఇబ్బందులు పెట్టేలా వారిపై కేసులు పెడుతున్నారు. 
 
చంద్రబాబును దెబ్బకొడితే బీజేపీకి బూస్ట్ అవుతుందనేది మోడీ ప్లాన్. ఎన్నో కేసులు ఉన్న జగన్‌ను పక్కన పెట్టేయడం ఆయనకు పెద్ద పనేం కాదు. జగన్‌కు ఈ విషయం అర్థంకాక ఎగిరెగిరి పడుతున్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదు. దేశంలో నిజమైన కూటమి అంటే భాజపా - భారాస- ఎంఐఎం. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశం ఉత్తర భారత్, దక్షిణ భారత్ అంటూ విడిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు నిశ్చితార్థం వరకే వచ్చింది. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. మా పార్టీకి సంబంధించి అక్కడ పొత్తులపై ఇప్పుడేం ఆలోచించలేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు