వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సతీమణి ధరించిన నెక్లెస్ విలువ రూ.23 కోట్లంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. జోగి రమేష్ కుమార్తె వివాహం తాజాగా జరిగింది. ఆ సమయంలో జోగి రమేశ్ సతీమణి 400 క్యారెట్ల వజ్రాలు పొదిగిన నెక్లెస్ను మెడలో ధరించారు. దీని ధర రూ.23.5 కోట్లుగా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ చర్చ సాగుతోంది. పైగా, ఈ వివాహ వేడుకలో ఆమె ధరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకర్షించింది. ఈ నెక్లెస్కు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది.
కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపా గూటికి చేరిన జోగి రమేశ్ గత వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అలాగే అగ్రిగోల్డ్ స్కామ్తో పాటు గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన పలు అవినీతి అక్రమాల్లో జోగి రమేశ్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గన్నవరం టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిపై కేసులోని నిందితుల్లో ఆయన ఒకరుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.