చంద్రబాబు ఇంటిపై దాడి కేసు : జోగి రమేష్‌కు పోలీసుల నోటీసు!!

ఠాగూర్

మంగళవారం, 13 ఆగస్టు 2024 (14:09 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసేందుకు వైకాపా కార్యకర్తలను వెంటబెట్టుకుని వెళ్లిన ఘటనకు సంబంధించి వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు ఏపీ పోలీసులు నోటీసులు జారీచేశారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విచారణకు కూడా మంగళవారం సాయంత్రం మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలని తెలిపారు. 
 
కాగా, అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో మంగళవారం ఉదయం జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పోలీసులు నోటీసులు ఇవ్వడం గమనార్హం. గత వైకాపా ప్రభుత్వంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేశ్, తన అనుచరులతో వెళ్ళి దాడికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. 
 
ఇదిలావుంటే తన కొడుకు అరెస్టుపై చేయడం సరికాదని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని అంతేకానీ అమెరికాలో చదువుకునివచ్చి డల్లాస్‌లో ఉద్యోగం చేసుకుంటున్న తన కుమారుడిపై కక్ష తీర్చుకోకూడదని ఆయన కోరారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ రోజు టీడీపీ అధికారంలో ఉండొచ్చు.. కానీ కక్ష సాధింపు చర్యలు ఏమాత్రం సరికాదన్నారు. చంద్రబాబు ఇలాంటి రాజకీయ కక్షలకు దూరంగా ఉంటే మంచిదని జోగిరమేష్ హెచ్చరిక ధోరణితో వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు