ఎల్ ఐ సి లో ప్రభుత్వ వాటాలను అమ్మ వద్దు: ఉద్యోగుల డిమాండ్

మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (21:50 IST)
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ లో ఎల్ఐసి లోని ప్రభుత్వ వాటాలను అమ్ముతామని ప్రతిపాదించడం ప్రజాసంక్షేమాన్ని దెబ్బతీస్తుందని, దేశ ప్రయోజనాల రీత్యా ఈ ప్రతిపాదన వెంటనే ఉపసంహరించాలని జీవిత బీమా ఉద్యోగులు ,అధికారులు డిమాండ్ చేశారు .

ఈ ప్రతిపాదన నిరసిస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా నగరంలోని ఎల్ఐసి ఉద్యోగులు, అధికారులు వాకౌట్ సమ్మె చేశారు.ఈ  సందర్భంగా బీసెంట్ రోడ్డు ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు, అధికారులు, ఏజెంట్ల ధర్నా జరిగింది.

సి ఐ టి యు ఈ ధర్నాకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది .ధర్నాను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఉందని చెప్పారు .

దేశాభివృద్ధికి లక్షల కోట్ల రూపాయల నిధుల అందిస్తున్న ఎల్ఐసి ,ఇతర కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టే ప్రతిపాదనలు చేశారని తెలిపారు. జనవరి 8 సమ్మె సందర్భంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మికులు కోరిన డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు.

ప్రజా సంక్షేమాన్ని కుదిస్తూ ఉద్యోగ, కార్మికుల మోసం చేసే బడ్జెట్ గా ఆయన పేర్కొన్నారు .ఈ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాల్సి ఉందని చెప్పారు. సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబూరావు వాకౌట్ సమ్మెకు మద్దతు తెలిపారు.

ప్రత్యామ్నాయ విధానాలతో ప్రస్తుత ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాల్సిన ఉందని ఆయన తెలిపారు. వామపక్షాలు ప్రజా అనుకూల ఆర్థిక విధానాల కోసం పోరాటాలను చేయడమే కాక పోరాడే వారికి అండగా నిలబడతారని తెలియజేశారు.

ఈ ధర్నాకు ఎల్ఐసి ఉద్యోగ సంఘ నాయకులు సిహెచ్ కళాధర్, ఎన్ ఎం కె ప్రసాద్ నాయకత్వం వహించారు .ధర్నాలో బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు ఎస్ వి రమణ, అధికారుల సంఘం నాయకులు దుర్గాప్రసాద్, డెవలప్మెంట్ ఆఫీసర్ ల నాయకులు రాంప్రసాద్ ,ఏజెంట్ల నాయకులు కోటేశ్వరరావు,

జయలక్ష్మి, పెన్షనర్ల నాయకులు ఎమ్.ఎన్ పాత్రుడు, సిఐటియు నాయకులు ఎన్ సి హెచ్ శ్రీనివాస్, ఎం వి సుధాకర్, కే దుర్గారావు, బీమా ఉద్యోగుల నాయకులు ఎన్ శ్రీనివాస్, కే అమర్నాథ్, గుర్రం శ్రీనివాస్ ,ఎం గోవర్ధన్ పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు