పోస్టింగ్ లేకుండానే పదవీ విరమణ చేస్తున్న 400 మంది ఉపాధ్యాయులు...

గురువారం, 22 జూన్ 2023 (11:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 1998 డీఎస్సీ పరీక్షల్లో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల్లో 400 మంది ఎలాంటి ఉపాధ్యాయ పోస్టింగులు లేకుండానే పదవీ విరమణ చేయాల్సిన విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వీరంతా ఈ నెలాఖరు నాటికి నెల వేతనం అందుకోకుండానే ఇంటికి వెళ్ళనున్నారు. 
 
వేసవి సెలవు తర్వాత ఏపీలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే, పోస్టింగ్‌ ఇవ్వని కారణంగా నెల జీతం తీసుకోకుండానే డీఎస్సీ-98 అభ్యర్థులు 400 మంది పదవీ విరమణ చేసే పరిస్థితి ఏర్పడింది. రెగ్యులర్‌ ఉపాధ్యాయుల బదిలీల కారణంగా గత విద్యా సంవత్సరంలో వీరు పొందిన పోస్టింగ్‌లు పోయాయి. దీంతో పాఠశాలలు పునః ప్రారంభమైన జూన్‌ 12న అభ్యర్థులు విధుల్లో చేరలేకపోయారు. 
 
అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో వీరికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఇటీవల కమిషనర్‌ ఆదేశించారు. కానీ అభ్యర్థులను ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియని విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వలేదు. గత విద్యాసంవత్సరం ఏప్రిల్‌ 12వ తేదీన పోస్టింగ్‌లు ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకు జీతం సైతం ఇవ్వలేదు. 
 
వీరిలో 16 మంది అదే నెలలో రిటైర్‌ అయిపోగా.. ఒప్పందం ముగిసి ఇంటి వద్ద ఉంటున్న 256 మంది మే నెలలో పదవీ విరమణ చేశారు. అభ్యర్థులకు పోస్టింగ్‌ ఇవ్వడంలో విద్యాశాఖ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుండటంతో నెలాఖరుకు మరో 400 మంది నెల జీతం తీసుకోకుండానే రిటైర్‌ అయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు