ఫర్నీచర్ పేరుతో కుచ్చుటోపీ.. భర్త పారిపోతే.. భార్య చిక్కింది...

మంగళవారం, 2 జులై 2019 (11:44 IST)
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో భార్యాభర్తలు ఫర్నీచర్ పేరుతో స్థానికులకు కుచ్చుటోపీ పెట్టారు. ఈ విషయం బహిర్గతం కావడంతో భర్త బాధితుల నుంచి తప్పించుకుని పారిపోగా, భార్య మాత్రం వారి చేతికి చిక్కింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ గోదావరి జిల్లాలోని తణుకులో స్థానిక వేల్పూరు రోడ్డులో శ్రీ ఫర్నీచర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరిట కోర్ల శ్రీనివాసు అనే వ్యక్తి స్టోర్‌ ప్రారంభించాడు. ఫర్నీచర్ స్కీమ్‌ను ప్రారంభించి, తక్కువ ధరకు గృహోపకరణాలను కొనవచ్చని ఆశ చూపాడు. ప్రజల నుంచి రూ.కోటికి పైగా వసూలు చేయడంతో పాటు, తన స్టోర్‌ను చూపించి, పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. 
 
ఆపై అతను ఊరొదిలి పారిపోగా, ఆయన భార్య ప్రసన్న బాధితులకు చిక్కింది. ఆమె ఊరు దాటేందుకు బస్సెక్కే ప్రయత్నం చేస్తుండగా, గమనించిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్కీమ్‌లో భాగంగా లక్షలాది రూపాయలు చెల్లించిన బాధితులు, వారి నుంచి డబ్బు వసూలు చేసిన ఏజంట్లూ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు