కేజ్రీవాల్‌కు ఈసీ వార్నింగ్

గురువారం, 6 ఫిబ్రవరి 2020 (08:26 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ అద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్నికల సంఘం హెచ్చరించింది. జనవరి 13న అరవింద్‌ కేజ్రీవాల్‌ తీస్‌ హజారీ కోర్టు ఆవరణలో న్యాయవాదులతో భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరిగి అధికారంలోకి వస్తే దిల్లీ హైకోర్టు ప్రాంతంలో కమ్యూనిటీ క్లినిక్‌ను నిర్మిస్తానని వాగ్దానం చేశారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత నీరజ్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ చేపట్టిన ఈసీ.. ఎన్నికల నియమావళిని అతిక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అరవింద్‌ కేజ్రీవాల్‌ను హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులపై అరవింద్‌ కేజ్రీవాల్‌ వివరణ ఇచ్చారు.

న్యాయవాదులతో భేటీ ప్రైవేటు కార్యక్రమమని, ముఖ్యమంత్రి హోదాలో తాను అక్కడికి వెళ్లలేదని తెలిపారు. అంతేకాకుండా తాను అక్కడ వాగ్దానాలేమీ చేయలేదని, గతంలో దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే మరోసారి చెప్పానని వివరణ ఇచ్చారు. కానీ, కేజ్రీవాల్‌ వివరణపై ఈసీ పెదవి విరిచింది. వివరణను అంగీకరించడం లేదని స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు