భవిష్యత్ తరాల అభ్యున్నతికి విద్య ద్వారానే పునాది: మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:12 IST)
భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం విద్య ద్వారానే పునాది వేయాలని, అది తెలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. 
 
"విద్య ద్వారానే భావి తరాలకు బంగారు బాటలు వేయవచ్చని తెలిసిన ముఖ్యమంత్రి విద్య అందరికి అందేలా గత రెండేళ్లుగా కృషి చేస్తున్నారు. జగనన్న విద్యాకానుక, అమ్మఒడి, విద్యాదీవెన లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల తల్లిదండ్రుల్లో ఆర్ధిక స్టైర్యాన్ని పెంచాం. దీనికి నిదర్శనమే ప్రభుత్వ పాఠశాలల్లో 6లక్షల మంది పిల్లలు అదనంగా చేరటం.
 
విద్యా కార్యక్రమాలతో విద్యార్థులకు దగ్గరైన ముఖ్యమంత్రి జగన్ మామయ్య అనే పిలుపు కు సార్ధక నామధేయుడు అని చెప్పుకుంటున్నారు. గురుశిష్యుల బంధం విడదీయరానిది. అందుకే ఆన్లైన్ తరగతుల కన్నా ప్రత్యక్ష తరగతులే వారిలో బంధాన్ని పెంపొందిస్తోంది. ఎన్ని అవరోధాలు వస్తున్నా ప్రత్యక్ష తరగతులు కోవిడ్ జాగ్రత్తలతో నిర్వహిస్తున్నాం.
 
ఇప్పటివరకు కోవిడ్ కారణంగా మరణించిన ఉపాధ్యాయులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాం. ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించలేకపోతున్నాం. ఉత్తమ ఉపాధ్యాయులకు అభినందనలు. వచ్చే ఏడాది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని భావిస్తున్నాను" అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు