ఏలూరులో నురగలు కక్కుతూ పడిపోతున్న జనం: రేపు కేంద్ర వైద్యబృందం రాక

సోమవారం, 7 డిశెంబరు 2020 (18:46 IST)
ఇప్పుడు ఏలూరులో ఏం జరుగుతోందో తెలియక జనం బెంబేలెత్తిపోతున్నారు. అస్సలు అంతు చిక్కని వ్యాధి పశ్చిమ గోదావరిజిల్లా ప్రజలను వణికిస్తోంది. జనం ఉన్నట్లుండి నోట్లో నుంచి నురగలు కక్కుతూ వాంతులు చేసుకోవడం, విరోచనాలు అవుతూ చనిపోతుండటం..ఇలా అంతు చిక్కని వ్యాధి ఏంటో జనానికి అస్సలు అర్థం కావడం లేదు. 
 
తాజాగా ఆఫీసుల్లో పనిచేస్తున్న వారు స్పృహ తప్పి పడిపోతుండటం కూడా ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇదేమైనా కరోనావైరస్ ఏమోనని ముందుగా పరీక్ష చేయించారు. అందరికీ నెగిటివ్ వచ్చింది. మళ్ళీ నీటిని పరిశీలించారు. నీటిలో ఎలాంటి ఇబ్బందులు లేవని తేల్చారు. అసలు సమస్య ఎక్కడుందో.. జనం ఎందుకు ఇలా పడిపోతున్నారో తెలియక వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.
 
రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఈ వ్యాధి ఏమిటో కనుక్కోలేకపోవడంతో ఇక కేంద్రమే రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ మేరకు కేంద్ర వైద్య బృందం రంగంలోకి దిగనుంది. అత్యవసరంగా ఈ బృందం ఏలూరుకు రానుంది. 
 
రేపు ప్రజల ఆకస్మిక అనారోగ్యంపై విచారణ చేయనుంది కేంద్ర వైద్య బృందం. ఈ బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రొఫెసర్ అవినాష్, వైరాలజిస్ట్ సంకేత్ కులకర్ణిలు ఉండనున్నారు. వీరు రేపు ఉదయం పరిశీలన జరిపి రేపు సాయంత్రం లోగా ప్రాథమిక నివేదికను సమర్పించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు