ప్రతి కుటుంబానికి తక్షణం రూ.5 వేలు చెల్లించాలి: జగన్‌కు చంద్రబాబు లేఖ

మంగళవారం, 31 మార్చి 2020 (19:28 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగ‌ళ‌వారం లేఖ రాశారు. కరోనా వ్యాధి తీవ్రత పెరుగుతుంటే ప్రజలను రేషన్ షాపుల ముందు క్యూలో నిలబెట్టడం తగదని, నాలుగున్నర లక్షల మంది గ్రామ వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుంటూ నిత్యావసరాలను ఇళ్లకు పంపిణీ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ప్రతి కుటుంబానికి తక్షణమే రూ.5 వేలు చెల్లించాలని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదని, ఉద్యానపంటలతో పాటు ఆక్వా, పౌల్ట్రీ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకోవటంతో పాటు వివిధ రంగాల రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో అనధికార మద్యం విక్రయాలు కలవర పెడుతున్నాయని, అక్రమ మద్యం విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి తగు రక్షణ పరికరాలు అందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలను ప్రభుత్వం చాలా తక్కువగా చేసిందని కరోనా కట్టడి కావాలంటే నిర్థారణ పరీక్షా కేంద్రాలను వీలైనన్ని ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 17వ తేదీన నిజాముద్దీన్ నుంచి దాదాపు 700 మంది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అంశం కలవరపెడుతోందన్నారు. వీరందరికీ తక్షణమే కోవిడ్ పరీక్షలు చేశాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపట్ల ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని, లాక్‌డౌన్ కారణంగా మానిసిక ఆందోళనలకు గురికాకుండా వారికి ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించాలని చంద్రబాబు అన్నారు.

ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, కరోనా సంక్షోభంలో ప్రభుత్వానికి సాయం అందించేందుకు ప్రతి రాజకీయ పార్టీ సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు