Ayurveda medicine Corona: ఆనందయ్య మందు ఐదు రకాలు, ఎవరెవరికి?

శనివారం, 22 మే 2021 (12:25 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులను పంపిణీ చేస్తున్నారు.

కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, పాజిటివ్‌ వచ్చిన వారికి నాలుగు రకాల మందులను ఇస్తున్నారు. కరోనా రాకుండా ‘పీ’ రకం మందును, కోవిడ్‌ వచ్చిన వారికి పీ, ఎఫ్, ఎల్, కే రకాలను ఇస్తున్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన వారికి నాలుగు రకాలతో పాటు పసరు డ్రాప్స్‌ ఇస్తున్నారు. 
 
1. పీ: 
ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్‌ వచ్చిన వారు రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్‌ లేని వారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఒక్క రోజు రెండు సార్లు వినియోగించాలి.

ఇందులో తెల్ల జిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌ దంగిలే ఐదు బకెట్లు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి అన్ని కలిపి ఒక బకెట్‌లో సిద్ధం చేసి మిక్సీ వేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి నాలుగు గంటల పాటు ఉడికించి మిశ్రమంగా తయారు చేసి ఇస్తున్నారు. 
 
2. ఎఫ్‌: 
పాజిటివ్‌ ఉన్న వారికి ఇస్తున్నారు. ఇందులో పుప్పింటి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల వరకు సిద్ధం చేసి ఆన్నింటిని కలిపి మిక్సీ వేసి చూర్ణంగా ఇస్తున్నారు. ఇది రోజు భోజనం తర్వాత రెండు సార్లు చొప్పున మూడు రోజులు తీసుకోవాలి. 
 
3. ఎల్‌: 
ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. ఇందులో నేల ఉసిరి, గుంట గలగర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కేజీలు తీసుకొని సిద్ధం చేస్తున్నారు. దీనిని ఫీ,ఎఫ్‌ రకాల మందుతో పాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి. 
 
4. కే: 
ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. ఇందులో పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల తీసుకుని కలిపి దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది పాజిటివ్‌ రోగులకు రోజుకు ఒక్క సారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి.
 
5. ఐ: 
ఆక్సిజన్‌ తగ్గిన వారికి కంటి డ్రాప్స్‌. తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలను వినియోగిస్తారు. ఇందులో కిలో తేనె, వంద గ్రాముల తోక మిరియాలు, కొద్దిగా వంకాయ గుజ్జుతో సిద్ధం చేసి పల్స్‌ తీవ్రను బట్టి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క డ్రాప్‌ వేయాలి. 
 
ఆనందయ్య కరోనా మందు పంపిణి నిలిపివేత: కలెక్టర్ ప్రకటన
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం అంటూ ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిపై సీఎం జగన్ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు.
 
మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు