స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైకాపా మహిళా నేత విడదల రజనీపై ఏపీ ఏసీబీ పోలీసులు కేసు నమోదు చేయగా, దీనిపై ఈ మాజీ మంత్రి స్పందించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం తనపై కక్షగట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రాథమిక ఆధారాలు కూడా లేకున్నా కేసులు బనాయిస్తోందని ఆమె ఆరోపించారు.
బీసీ మహిళ అయిన తాను రాజకీయంగా ఎదుగుతుండటాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని న్యాయపోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. గత 2022 సెప్టెంబరు నెలలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్టు విడుదల రజనీపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.